Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొడ్చన్పల్లి దళితుల డిమాండ్
- మెదక్-బొడ్మట్పల్లి రహదారి పక్కన వంటావార్పు
నవతెలంగాణ-మెదక్
అసైన్డ్ భూములను తిరిగి తమకే కేటాయించి, అందులోంచి స్థానికేతరులను పంపేయాలని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి దళితులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే పలురూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. సోమవారం మెదక్-బొడ్మట్పల్లి రహదారి పక్కన వంటావార్పు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పొడ్చన్పల్లి గ్రామపరిధిలోని 1168/29 సర్వే నెంబర్లో 492.28 ఎకరాల అసైన్డ్ భూముల్లో తమ ముందు తరాల నుంచి సాగు చేసుకుంటున్నామన్నారు. 1970 నుంచి 2009 వరకు ఆయా ప్రభుత్వాలు పట్టాలు జారీ చేశాయన్నారు. కానీ, ఈ భూమిని కొంత కాలంగా స్థానికేతరులు కబ్జా చేశారని తెలిపారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని వాపోయారు. అందుకే ఆందోళనలు చేస్తున్నామని చెప్పారు. ఈనెల 3న జిల్లా జాయింట్ కలెక్టర్ నాగేశ్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుమారు 200 మంది దళితులు పాల్గొన్నారు.
ఇటుకబట్టీలు సీజ్
అసైన్డ్ భూముల్లో అక్రమంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పాపన్నపేట్ గిర్దవార్ యూసుఫ్, వీఆర్ఓ సుదర్శన్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇటుకబట్టీలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. అందులోంచి ఇటుకలు తీస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.