Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ డైరెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బీసీ వసతి గృహాల సంఖ్యను పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం వందలాది మంది విద్యార్థులతో ఆయా సంఘాల నేతలు బీసీ డైరెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరువేల కాలేజీల్లో సుమారు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఉంటే వారికి కేవలం 251 హాస్టళ్లను మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు కూడా 26 వేల మంది విద్యార్థులకు మాత్రమే సరిపోతుండటంతో మిగతా విద్యార్థులు హాస్టళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కాలేజీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు హాస్టళ్లల్లో సీట్లు లభించక అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నాలుగువేలకు పైగా కాలేజీలు ఉన్నాయని, ఇందులో మెడిసిన్, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ కోర్సులతో పాటు ఇతర వృత్తివిద్యా కోర్సులు, శిక్షణా కోర్సుల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. హాస్టళ్ల కొరత వల్ల గ్రామీణ ప్రాంతం నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చిన విద్యార్థులు హాస్టళ్లలో సీట్లు లభించకపోవడంతో చదువు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హైదరాబాద్లో 20 రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్ జిల్లాలో 12 కొత్త హాస్టళ్ల చొప్పున ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.