Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి
- రౌండ్ టేబుల్లో వక్తలు
నవతెలంగాణ- సిటీబ్యూరో
ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని పలువురు వక్తలు అన్నారు. ఈఎస్ఐలో వందల కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చినా ఇంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కుంభకోణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్రావు అధ్యక్షతన సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈఎస్ఐ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ఆరు నెలల కిందటే నివేదిక ఇచ్చినా, చర్యలు తీసుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మందుల కొనుగోలులో అప్పటికప్పుడే పుట్టుకొచ్చిన కంపెనీలతో వందల కోట్ల రూపాయల లావాదేవీలు ఎలా నిర్వహిస్తారని, అందులో 100-300 శాతం అధిక రేట్లకు మందులను ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో డూప్లికేటు పేషెంట్లను సృష్టించి, వారికి మందులు పంపిణీ చేసినట్టుగా రికార్డులు తయారు చేయడం వెనుక ఉన్నతాధికారుల, ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోందని చెప్పారు.
సీపీఐ నగర సమితి కార్యదర్శి ఇ.టి నరసింహా మాట్లాడుతూ.. ఈఎస్ఐ కంభకోణం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తే.. ప్రభుత్వంలోని పెద్దలపై కూడా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ విషయంపై కార్మికులు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ నగర కార్యదర్శి నరసింహా మాట్లాడుతూ.. కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూలను ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ (హెచ్డీసీ)ల నుంచి అకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ డిస్పెన్సరీల్లోనూ కనీస సౌకర్యాలు లేక సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ఐఎఫ్టీయూ నగర కార్యదర్శి ఎస్ఎల్ పద్మ మాట్లాడుతూ.. మెడికల్ మాఫియా వైద్యాన్ని వ్యాపారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కమీషన్ల కోసం నాసిరకం వస్తువులు, నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల వాటాతో ఏర్పాటైన ఈఎస్ఐ సంస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు.
సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో థైరాయిడ్ పరీక్షను తొలగించారని చెప్పారు. సనత్నగర్ ఆస్పత్రిలో సిటీస్కాన్ టెస్ట్కు 20 రోజులు ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈఎస్ఐలో జరిగిన భారీ కుంభకోణం విషయంలో కార్మికులు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించాలని, కార్మిక శాఖ మంత్రికి మెమోరాండం ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎం.దశరథ్, సీఐటీయూ నాయకులు వాణి పాల్గొన్నారు.