Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికే మోడల్గా చింతమడక
- ఐదేండ్లలో అన్ని తరగతుల సమస్యలు పరిష్కరించా..
- ప్రస్తుతం స్వగ్రామాభివృద్ధికి సంకల్పించా.. : సీఎం కేసీఆర్
- సిద్దిపేట జిల్లాలో ఆత్మీయ, అనురాగ సమ్మేళనం
నవతెలంగాణ- సిద్దిపేట ప్రతినిధి
''తొలి ఐదేండ్లలో రాష్ట్రంలోని అన్ని తరగతుల వారి సమస్యలు పరిష్కరించా. ప్రస్తుతం స్వగ్రామం అభివృద్ధికి సంకల్పించా. అందుకే చింతమడకలోని ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు లబ్ది చేకూరే పథకానికి శ్రీకారం చుడుతాం'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని స్వగ్రామమైన చింతమడకలో సోమవారం సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మీయ, అనురాగ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. బాల్య మిత్రులు, గ్రామస్తులతో కరచాలనం చేశారు. అనంతరం సభా వేదికపై ప్రసంగించారు. చాలా కాలం తర్వాత తన కోరిక నెరవేరుతోందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టిన రోజు చాలా సంతోషించానని తెలిపారు. తమ ప్రభుత్వంలాగా రైతుల గురించి ఎవరూ ఆలోచించడం లేదన్నారు. గ్రామంలో మళ్లీ నీటి ఊటలు, బావుల్లో నీరు చూడబోతున్నామన్నారు. 'మీ ఊరి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నడు. చనుబాలు ఇచ్చి పెంచిన నా ఊరు చింతమడక.. మరో మూడు గ్రామాలు నాకు విద్యాబుద్ధులు ప్రసాదించాయి' అని అన్నారు.
ఊరు బాగుపడాలంటే గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండాలన్నారు. చింతమడకలో అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని, చింతమడక హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అన్నారు. తోర్నాల, గూడూరు, దుబ్బాక, పుల్లూరు గ్రామాలకు రుణపడి ఉన్నానని చెప్పారు. తమ గురువులు మత్యుంజయ శర్మ, రాఘవారెడ్డిని గుర్తు చేసుకున్నారు. తనకు తెలుగు సాహిత్యం వారి వల్లే అబ్బిందన్నారు. ఎర్రవల్లిని ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామాలను అభివద్ధి చేయాలన్నారు. ఆరు నెలల్లోపు అన్ని ఇండ్లు నిర్మించి, వాటిపై నీటి ట్యాంక్లు ఏర్పాటు చేయాలని, అవి పూర్తయ్యాక మళ్లీ వస్తానని చెప్పారు. అప్పుడు పెద్దఎత్తున పండుగ చేసుకుందామన్నారు. చింతమడకకు అదనంగా రూ.50 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.
పాల ఉత్పత్తి పెంచితే గ్రామంలో చిల్లింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయిస్తానన్నారు. చింతమడక, మాచాపూర్, దమ్మచెర్వు, అంకంపేట, సీతారాంపల్లి గ్రామాల్లో ఫంక్షన్ భవనాలు నిర్మించాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గం రాజకీయంగా నన్ను పెంచిందని తెలిపారు. 81 గ్రామాలకు రూ.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రంగనాయక కట్ట అభివద్ధికి రూ.5 కోట్లు, సిద్దిపేట పట్టణానికి రూ.25 కోట్లు, దుబ్బాకకు రూ.10 కోట్లు, పుల్లూరు, తోర్నాల, గూడూరు గ్రామాలకు రూ.కోటి చొప్పున మంజూరీ చేస్తామన్నారు. అందరి సహకారంతో చింతమడకను మోడల్ గ్రామంగా తీర్చుదిద్దుకుందామని చెప్పారు. ఇందుకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే హరీశ్రావు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్రావు, రామలింగారెడ్డి, యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, సీఎం సహాయకులు దేశపతి శ్రీనివాస్, విజయకుమార్, మహిళా శిశుసంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ బూర విజయ, సివిల్ సప్లరు రాష్ట్ర చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జేసీ పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.