Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-తొలి నోటిఫికేషన్ విడుదల
-770 సివిల్ ఇంజినీరింగ్ (ఎఇఇ) పోస్టుల భర్తీ
- దరఖాస్తుల స్వీకరణ గడువు సెప్టెంబర్ 3
- ఆన్లైన్లో వచ్చేనెల 20న రాతపరీక్ష
- నెలాఖరులోగా మిగతా ఇంజినీరింగ్ పోస్టులకు ప్రకటన
- టిఎస్పిఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రకటనల ప్రక్రియ షురూ అయ్యింది. బుధవారం 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఎఇఇ) పోస్టుల భర్తీకి సంబంధించిన తొలి నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సీ) విడుదల చేసింది. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిఎస్పిఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సివిల్ ఇంజినీరింగ్ ఎఇఇల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఇందులో గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి 418 పోస్టులు, ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ నుంచి 121 పోస్టులు, మున్సిపల్ ఎఇఇలు ఐదు పోస్టులు, రోడ్లు భవనాల శాఖ నుంచి 83 పోస్టులు, నీటిపారుదలశాఖ నుంచి 143 పోస్టుల చొప్పున మొత్తం 770 ఎఇఇల పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు. టిఎస్పిఎస్సీ వెబ్సైట్లో గురువారం ఉదయం నాటికి నోటిఫికేషన్ పూర్తి వివరాలు పొందుపరుస్తామని చెప్పారు. సివిల్ ఇంజినీరింగ్ ఎఇఇల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు వచ్చేనెల 3 అని తెలిపారు. బిఇ/బిటెక్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ పట్టభద్రుల అర్హులని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరారు. ఎఇఇల పోస్టులకు 450 మార్కులకు రాతపరీక్ష ఆన్లైన్లో వచ్చేనెల 20న నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఈ రాతపరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. మొదటిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఈ పరీక్ష పారదర్శకంగా జరుపుతామని అన్నారు. 25న మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత 50 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అక్టోబర్ మొదటి వారంలోగా ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.
మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులకుత్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మిగతా ఇంజినీరింగ్ పోస్టులకు (అసిస్టెంట ఇంజినీర్లు) సంబంధించి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఆ దిశగా టిఎస్పిఎస్సీ కసరత్తు చేస్తోందని తెలిపారు. కొన్ని పోస్టులకు రోస్టర్ పాయింట్లు, అర్హతలు వంటి వివరాలను శాఖలు అందజేయాల్సి ఉందన్నారు. అవి రాగానే మరికొన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. సెప్టెంబర్లో వ్యవసాయశాఖ పరిధిలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. రవాణా శాఖలోని మోటార్వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.
సివిల్ ఇంజినీర్లు 10 వేల మంది దరఖాస్తు
వన్టైం రిజిస్ట్రేషన్ (ఒటిఆర్) ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు 2.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చక్రపాణి వివరించారు. ఇందులో సివిల్ ఇంజినీర్లు 10 వేల మంది ఉన్నారని తెలిపారు. సివిల్ ఇంజినీర్లు దాదాపు దరఖాస్తు చేసుకున్నట్లేనని అన్నారు. మూడు నిమిషాల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయొచ్చని సూచించారు. ఫీజులను చెల్లించి వెబ్సైట్లో ఒటిఆర్ సహాయంతో దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయొచ్చని తెలిపారు. మిగిలిన అభ్యర్థులు ఒటిఆర్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లు సడలింపు ఇచ్చిందని చెప్పారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 18 నుంచి 44 ఏండ్ల వరకు దరఖాస్తు చేయొచ్చని అన్నారు. 2015, జూలై ఒకటో తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు 49 ఏండ్లు, వికలాంగులకు 54 ఏండ్ల వరకు దరఖాస్తు చేయడానికి అవకాశముందని అన్నారు. అన్ని కేటగిరీల్లోని ఇన్సర్వీస్ ఉద్యోగులకు ఐదేండ్ల సడలింపు ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బిసి వికలాంగ ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన సడలింపు ద్వారా 64 ఏండ్లు అవుతుందని, కానీ నిబంధనల ప్రకారం 58 ఏండ్లు ఉద్యోగ విరమణ వయస్సు అయినందున 58 ఏండ్ల వరకు దరఖాస్తు చేయాలని తెలిపారు. ముస్లిం మైనార్టీల రిజ్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్పిఎస్సీ సభ్యులు సి విఠల్, బి చంద్రావతి, మహమ్మద్ మతీనుద్దీన్ ఖాద్రీ, కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ పాల్గొన్నారు.
అక్టోబర్లో గ్రూప్-2
- ఇంటర్వ్యూ ఉండొద్దనడం సరికాదు
- ఈనెలాఖరులోగా గ్రూప్స్ సిలబస్ విడుదల
- డిసెంబర్లోగా 80 శాతం ఉద్యోగాల భర్తీ
- బయోమెట్రిక్ విధానం అమలు చేస్తాం
- గ్రూప్-1,2కు ఆన్లైన్ పరీక్ష ఉండదు
- టిఎస్పిఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ అక్టోబర్ చివరి వారంలో విడుదల చేస్తామని టిఎస్పిఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చెప్పారు. నవంబర్ లేదా డిసెంబర్లో రాతపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని టిఎస్పిఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్-2పై నిరుద్యోగులంతా కేంద్రీకరించి చదువుతున్నారని తెలిపారు. అందుకే తామూ గ్రూప్-2 నిర్వహణపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. గ్రూప్-2లో ప్రస్తుతానికి 434కు పైగా పోస్టులున్నాయని అన్నారు. నెల, రెండు నెలలు ఆగితే మరిన్ని పోస్టులు పెరిగే అవకాశముందని తెలిపారు. మరోవైపు సిలబస్ మారినందున ఒకటి, రెండు నెలలు గడువు ఇవ్వాలని నిరుద్యోగులు, ఇతర సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయన్నారు. కొత్త రాష్ట్రం కొత్త సిలబస్ అయినందున కొంత గడువు ఇస్తున్నామని అన్నారు. డిసెంబర్లోగా కమల్నాథన్ కమిటీ నివేదిక వస్తుందని చెప్పారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ జరిగితే గ్రూప్-2, గ్రూప్-1లో మరిన్ని పోస్టులు కలుస్తాయన్నారు. గ్రూప్-1లో 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 33 పోస్టులకు న్యాయపరమైన సమస్యలున్నాయని వివరించారు. ఇక మిగిలిన 20 పోస్టుల కోసం గ్రూప్-1 ప్రకటించడం భావ్యం కాదన్నారు. టిఎస్పిఎస్సీ ద్వారా భర్తీ చేసే 3,783 ఉద్యోగాల్లో 80 శాతం డిసెంబర్లోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. మార్చినాటికి గ్రూప్-2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ, నియామకాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన 3,783 పోస్టులన్నింటినీ ఈ ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పారు. గ్రూప్స్నకు సంబంధించిన పూర్తిస్థాయి సిలబస్ను వచ్చేవారం ప్రకటిస్తామని తెలిపారు. గ్రూప్-2కు ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. ఇంటర్వ్యూ ఉండొద్దని చెప్పడం సరికాదని తెలిపారు. ఉద్యోగాల నియామకాల విధానం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని అన్నారు. రాతపరీక్ష మాత్రమే ఉండాలా?, ఇంటర్వ్యూ ఉండాలా? అనేది ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. ఆ నిర్ణయాన్ని తాము అమలు చేస్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ గ్రూప్-2 క్యాడర్కు రాతపరీక్షతోపాటు ఇంటర్వ్యూ అమల్లో ఉందన్నారు. టిఎస్పిఎస్సీ ఏర్పడిన తర్వాత నియామకాల ప్రక్రియ చేపట్టలేదని అన్నారు. అప్పుడే కమిషన్కు దురుద్దేశాలు ఆపాదించడం సరైంది కాదన్నారు. గతంలో ఎపిపిఎస్సీ చేసిన అవినీతి, అవకతవకలను తాము పునరావృతం చేయాలనుకోవడం లేదని చెప్పారు. మార్గదర్శకాల ప్రకారమే పారదర్శకంగా నియామకాల ప్రక్రియ చేపడతామని అన్నారు. కమిషన్పై నమ్మకం లేనివారు ఉద్యోగాలకు దరఖాస్తు చేయొద్దని సూచించారు. ఇప్పటి వరకు ప్రతి అంశాన్నీ బహిరంగంగా వివరిస్తున్నామని, గోప్యత పాటించడం లేదన్నారు. వ్యాపం, మెడికల్, ఎడ్సెట్ రాతపరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. దరఖాస్తు చేసిన విద్యార్థి, పరీక్ష రాస్తున్నారా? లేక మరొకరు రాస్తున్నారా?అన్నది తెలుసుకోవచ్చని అన్నారు. ఒకేసారి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు తీసుకుంటామని, అన్ని పరీక్షలకూ దానిని పరిశీలిస్తామని చెప్పారు. ఆన్లైన్ పరీక్షా విధానం అన్ని పరీక్షలకూ సాధ్యం కాదన్నారు. సాంకేతిక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకే పరిమితం చేస్తామని చెప్పారు. గ్రూప్-1,2 పరీక్షలకు లక్షలాది మంది దరఖాస్తు చేసే అవకాశమున్నందున ఆన్లైన్ పరీక్ష సాధ్యం కాదన్నారు. 25 లేదా 30 వేల మంది దరఖాస్తు చేస్తే ఆన్లైన్ పరీక్ష సాధ్యమని అన్నారు.