Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెసిఆర్కూ చంద్రబాబుకు పట్టిన గతే
- ఐద్వా బస్సు యాత్రలో నాయకులు
నవతెలంగాణ-ఇల్లందు, పాల్వంచ, మధిర
రాష్ట్రాభివృద్ధికి మద్య నిషేధమే మార్గమని, గంగదేవిపల్లి అభివృద్ధికి అదే కారణమని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆశాలత, బత్తుల హైమావతి అన్నారు. మద్యాన్ని నియంత్రించాలని, మహిళలపై హింసను అరికట్టాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బుధవారం ఖమ్మం జిల్లా ఇల్లందు, పాల్వంచ, మధిర మండలాల్లో
కొనసాగింది. ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో సభలో వారు మాట్లాడుతూ.. గుడుంబాను అరికట్టే నెపంతో కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా మద్యం పారే తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. 2014లో మద్యం ద్వారా రూ.13వేల కోట్లు ఆర్జించిన ప్రభుత్వం ఈ ఏడాది మరో రూ.10వేల కోట్లు ఆర్జించడానికి ప్రయత్నిస్తోందన్నారు. మద్యం ద్వారా వచ్చే డబ్బులతో ప్రభుత్వాలను నడపడం సిగ్గుచేటన్నారు. వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి పంచాయతీలో మద్యాన్ని నిషేధించిన ఘనత సిపిఎంకే దక్కిందన్నారు. రాజకీయ పార్టీలను, ప్రజలను ఏకం చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందడుగు వేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఆ గ్రామాన్ని ప్రశంసించారన్నారు. అక్కడి అభివృద్ధికి ప్రధాన కారణం మద్యాన్ని నిషేధించడమేనని అన్నారు. మద్యం పాలసీని వెనకకు తీసుకోకపోతే గతంలో చంద్రబాబుకు పట్టిన గతే కేసిఆర్కూ పడుతుందని హెచ్చరించారు. పివోడబ్య్లూ రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ సంఘీభావంగా మాట్లాడుతూ.. గ్రామజ్యోతి కార్యక్రమాల్లో మద్యం వద్దని తీర్మానాలు చేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఐద్వా నాయకులు అఫ్రోజ్ సమీనా, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, రత్నమాల, మహేశ్వరి తదితరులు ప్రసంగించారు.