Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిండు కుండల్లా ప్రాజెక్టులు
- కృష్ణా బ్యారేజీ నుంచి 70 గేట్ల ద్వారా నీటి విడుదల
- పదేండ్ల తర్వాత సముద్రానికి
- ఎగువ నుంచి 8 లక్షల క్యూసెక్కులు ఇన్ఫో
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి.ఎగువ ప్రాంతం నుంచి 8.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. పదేండ్ల తర్వాత ప్రకాశం బ్యారేజీలో 70 గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేయటంతో సముద్రానికి నీరు చేరుతున్నది. కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు, తుంగభద్ర బ్యారేజీ నుంచి భారీగా నీరు విడుదల చేయటంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నుంచి గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తుండగా జూరాల ప్రాజెక్టులో ఇన్ఫ్లో 7,45,000 క్యూసెక్కులకు చేరింది. జూరాల నుంచి 7,31,549 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా తుంగభద్ర నుంచి 1,15,957 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల నీరు శ్రీశైలం రిజర్వాయర్కు వచ్చి చేరుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రానికి ఇన్ఫ్లో 8,82,980 క్యూసెక్కులుగా ఉన్నది. ఈ ప్రాజెక్టులోని 10 గేట్ల ద్వారా 8,83,707 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు విడదుల చేస్తున్నారు. సాగర్లో ఇన్ఫ్లో 8,14,031 క్యూసెక్కులు కాగా ప్రాజెక్టులోని 26 గేట్ల ద్వారా 5,35,091 క్యూసెక్కుల నీరు కిందకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 270 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకి విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ద్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 23.27 టీఎంసీలుగా ఉన్నది. ఈ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 7,11,817 క్యూసెక్కులు కాగా 4,24,340 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 4.5 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. కృష్ణా నదికి వరద పోటెత్తటంతో పట్టిసీమ నీటి పంపింగ్ నిలిపివేశారు.
కృష్ణా ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వస్తుండటంతో రెండు రాష్ట్రాల ఇంజినీర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కృష్ణా బోర్డు అదికారులు కూడా ప్రాజెక్టుల్లో వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. భారీ వరదల నేపధ్యంలో నీటి పంపకాల కోసం మంగళవారం హైదరాబాద్లో జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు.
ప్రధాన రిజర్వాయర్లలో శనివారం పరిస్థితి
రిజర్వాయర నీటి నిల్వ ప్రస్తుత నీట ఇన్ఫ్లో అవుట్ఫ్లో
సామర్ధ్యం నీటి నిల్వ (క్యూసెక్కుల్లో) (క్యూసెక్కుల్లో)
(టీఎంసీల్లో) (టీఎంసీల్లో)
ఆల్మటి 129.72 110.32 6,04,814 5,70,000
నారాయణపూర్ 37.64 27.40 6,05,000 5,94,550
జూరాల 9.66 5.84 7,45,000 7,31,549
శ్రీశైలం 215.81 185.14 8,82,980 8,83,797
తుంగభద్ర 100.86 96.86 1,56,379 1,15,957
నాగార్జునసాగర్ 312.05 269.12 8,14,931 5,35,031
పులిచింతల 45.77 23.27 7,11847 4,24,349