Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదక్ ఎస్టీ మినీ బాలికల గురుకులంలో ఘటన
- ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
- వాచ్మెన్, ఆయాపై దాడి.. కేసు నమోదు
నవతెలంగాణ-మెదక్
నీటి సమస్య ఉంటే ఎవరైనా సంబంధితాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటారు.. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారు.. కానీ, మెదక్ జిల్లాలో మాత్రం ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినుల జుట్టు కత్తిరించారు. జుట్టు లేకుంటే స్నానానికి నీళ్లు తక్కువగా వాడుకోవచ్చని ఇలా చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మినీ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వాచ్మెన్పై, ఆయాపై దాడి చేశారు. దీంతో పోలీసులు తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని జంబికుంట వీధిలో ఉన్న ఎస్టీ బాలికల మినీ గురుకులంలో సుమారు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. చాలాకాలం నుంచి ఇక్కడ నీటి ఎద్దడి ఉంది. బోర్లు వేసినా ఫలితం లేదు. మున్సిపల్ అధికారులకు విన్నవిస్తే అప్పుడప్పుడు నీటిట్యాంకర్లతో సరఫరా చేశారు. తదనంతరం షరామామూలే. ఇక లాభం లేదనుకుని ప్రిన్సిపాల్ అరుణ విద్యార్థినుల జుట్టు కట్ చేయించారు. జుట్టు కత్తిరించేందుకు పిల్లల నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో తమ పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. బాలికలను చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దాంతో ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాచ్మెన్ కల్పన, ఆయా శోభపై దాడి చేశారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకే తాను జుట్టు కట్ చేయించానని ప్రిన్సిపాల్ చెప్పడం గమనార్హం.
ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి..
విద్యార్థినుల మనోభావాలు దెబ్బతినేలా జుట్టు కత్తిరించిన ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని ఆలిండియా బంజార ఎంప్లాయీస్ సేవాసంఫ్ు జిల్లా అధ్యక్షకార్యదర్శులు చందీరాం, సామ్యనాయక్, ఉపాధ్యక్షులు గోపాల్నాయక్ డిమాండ్ చేశారు. నీటి ఎద్దడి ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సింది పోయి విద్యార్థినుల జుట్టు కత్తిరించి గిరిజన జాతిని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ను వెంటనే విధుల నుంచి తప్పించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్నాయక్ హెచ్చరించారు.