Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరలింపు జాప్యంపై సీఎం అసహనం!
- కేసీఆర్ వ్యాఖ్యలతో సీఎస్ అలక
- అటు వైపు తొంగి చూడను
- పాత సచివాలయానికి వెళ్లడానికి విముఖత
- ఇంటినుంచే విధులు నిర్వహించే ఆలోచన
- ఆ వార్తల్లో నిజంలేదన్న ముఖ్యమంత్రి కార్యాలయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినని కూడా చూడకుండా అధికారులందరి ముందే సీఎం కేసీఆర్ నాపై కోప్పడ్డారు. కనీసం నా సీనియార్టీని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. గాడి తప్పిన పాలనను సరి చేయడానికి ఎంతో శ్రమిస్తున్నా. అయినా అందరి ముందు అవమానపడ్డాను. ఇక మీదట పాత సచివాలయంలో అడుగుపెట్టను. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడను. తప్పని సరి అనుకుంటే తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవన్కు వెళతా. అక్కడ కూడా సవ్యంగా లేకుంటే ఇంటి నుంచే విధులు నిర్వహిస్తా'' అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కె జోషి తన సహచర ఐఏఎస్ అధికారులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సీఎం వ్యాఖ్యలతో సీఎస్ అలకబూనినట్టు సమాచారం.
అసలేం జరిగింది..
సచివాలయం తరలింపు ప్రక్రియపై సీఎం కేసీఆర్ మంగళవారం సీఎస్ను ఆరా తీసినట్టు సమాచారం. తరలింపు ప్రక్రియ నత్తనడకన సాగడం, తాత్కాలిక సచివాలయంలో ఏర్పాట్లు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో సీఎం సీఎస్పై మండిపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ నుంచే పాలన కొనసాగించాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖమంత్రి ఆదేశాలనే పట్టించుకోకపోతే ఎలా? అని కేసీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం. సమీక్ష జరుగుతున్న క్రమంలోనే అధికారులందరి ముందు గట్టిగా నిలదీశారన్నది ఆరోపణ. దీంతో సీఎస్ తీవ్ర మనస్తాపానికి గురయినట్టు సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
3000 మందిని ఎలా సర్దుతాం?
పాత సచివాలయం ఉద్యోగులు 6000 మంది దాకా ఉన్నారు. కానీ తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో కేవలం 600 మంది ఉద్యోగులకే సరిపోతుంది. మిగతా 2400 మందిని ఎక్కడ సర్దుబాటు చేస్తామని సీఎస్ అధికారులతో ప్రస్తావించినట్టు తెలిసింది. కనీసం ముఖ్యమంత్రి బీఆర్కే భవన్ సందర్శించకుంటే అందులో ఉండే లోటుపాట్లు ఎలా తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అందులో మౌలిక సదుపాయాలు కూడా లేవు. పైఅంతస్తులకు వెళ్లడానికి ఇప్పుడున్న ''లిఫ్ట్'' లు కూడా చాలవు, మరుగు దొడ్లు, మూత్రశాలలు సరిపోవు. ప్రతి పని కంప్యూటర్లపైనే చేయాలి. కానీ ఇప్పటి వరకు కేబుల్ సౌకర్యం కూడా లేదు. ప్రస్తుత సచివాలయానికి గచ్చిబౌలి నుంచి కేబుల్ నెట్ వర్క్ సదుపాయం ఉంది. తాత్కాలిక సచివాలయంలో కేబుల్ పనులు కూడా మొదలు కాలేదు. ఇలాంటి తరుణంలో ఆగమేఘాల మీద ఉద్యోగులందరినీ అక్కడికి తరలిస్తే విధులు ఎలా నిర్వహిస్తారని సీఎస్ ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారుల ముందు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత సెక్రటేరియట్ ముఖం కూడా చూడబోనని సీఎస్ జోషి.. సహచర ఉద్యోగులతో తెగేసి చెప్పారన్న వినికిడి. ఇకపై బూర్గుల రామకృష్ణారావు భవనానికే వస్తానని.. అక్కడ వసతి లేకపోతే ఇంటినుంచే కార్యకలాపాలు నిర్వహిస్తానని సీఎస్ అన్నట్టు తెలిసింది.
సీఎం తీరుపై అసహనం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి పట్ల సీఎం అమర్యాదంగా వ్యవహరించారన్న ప్రచారం జరగడంతో కొందరు సీనియర్ ఐఏఎస్లు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పదవీ విరమణ చేసిన ఒక ఐఏఎస్ అధికారి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఆయన సూచనలు, సలహాల ప్రకారమే సీఎం నడుచుకుంటున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.
అలాంటిదేమీ లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం చేసారన్న వార్తల్లో నిజం లేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.