Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలి: తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని పరిష్కరించాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించనందున రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేటు ఆస్పత్రులు వైద్యసేవలను నిలిపివేశాయని తెలిపారు. దీంతో వైద్య సేవలందక పేదలు, రోగులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛన్దార్లు, పాత్రికేయుల ఆరోగ్య పథకాల సేవలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపినా సఫలం కాలేదని పేర్కొన్నారు. బకాయిలు ఎంత చెల్లించాలనే విషయంలో పట్టుదలకు పోకుండా ఈ సమస్యను ప్రజా సంక్షేమం కోణంలో ఆలోచించి సమస్య పరిష్కారానికి పూనుకోవాలని కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణం సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.