Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రమంజిల్లోనూ....
- భారీగా నిధినిక్షేపాలు
- యాదగిరిగుట్టలో బెడిసికొట్టిన వ్యూహం
- అందుకే పనుల నత్తనడక
- సొరంగాలు ఉన్నమాట వాస్తవమే: పురావస్తుశాఖ
- అందుకే కొత్త నిర్మాణాలు అంటున్న కేసీఆర్?
- సోషల్ మీడియాలో ప్రచారం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఇప్పటికే యజ్ఞాలు, హౌమాలు, పుణ్యక్షేత్రాలు, మొక్కుబడులు అంటూ తిరుగుతున్న సీఎం కేసీఆర్ పరివారం చూపు ఇప్పుడు గుప్త నిధులపై పడిందా? అంటే కొందరు అవుననే అంటున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు. ''ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త సెక్రటేరియట్ భవనం కట్టితీరతాం...ఇందులో ఎలాంటి సందేహం లేదు'' అంటూ ఆగస్టు 15న గోల్కొండ కోటపై నుంచి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉన్నవాటిని కూల్చి, కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాధానం ఇప్పటి వరకు లభించలేదు. అయితే ప్రభుత్వం ఎంచుకుంటున్న భవనాలు కూడా చారిత్రాత్మక ప్రదేశాల్లో ఉన్నవే కావడం గమనార్హం. ఐదేండ్ల క్రితం యాదగిరిగుట్టలో కూల్చివేతలు చేపట్టినప్పుడు కూడా 'గుప్తనిధులు' ప్రస్తావన వచ్చింది. వాటికోసమే తవ్వకాలు జరుపుతున్నారని ప్రచారం జరిగింది. పునాదుల పేరుతో భూమిలో తవ్వకాలు జరిగే వరకు యుద్ధప్రాతిపదికన జరిగిన పనులు ఆ తర్వాత నత్తకు నడకలు నేర్పుతున్నాయి. 'మరో ఐదేండ్లు కావాలా' అని ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 'గుట్ట'లో పెరిగిన రియల్ఎస్టేట్ వ్యాపార కోణం మరోవైపు ఉండనే ఉంది. 'గుట్ట'లో గుప్తనిధుల సంగతి ఏమో కానీ...ఇప్పుడున్న సెక్రటేరియట్ భూగర్భంలో సొరంగాలు ఉన్నమాట వాస్తవమేనని పురావస్తుశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు నిజాం నవాబు ఆధీనంలో ఉన్నదని, గోల్కొండ కోట నుంచి ఇప్పటి మింట్ కాంపౌండ్ మీదుగా, ఎర్రమంజిల్ భవనాల వరకు సొరంగాలు ఉన్నాయని పురావస్తుశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గతంలో ఇక్కడి హౌంసైన్స్ కళాశాలలోని పురాతన పొగగొట్టం క్రింద తవ్వకాలు జరిపినప్పుడు ఈ తరహా సొరంగాలు బయటపడిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. నిజాం కాలంలో నేలమాళిగల్లోనే వజ్రవైఢూర్యాలతో కూడిన గుప్తనిధులు దాచి ఉంటారనే ప్రచారం ఉంది. వీటికోసమే సీఎం కేసీఆర్ పరివారం సెక్రెటేరియట్, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతల పేరుతో తవ్వకాలు జరిపే ప్రయత్నం చేస్తున్నదని సోషల్మీడియాలో హల్చల్ అవుతున్నది. మరోవైపు పురాతన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూడా కూలుస్తామని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కూల్చివేతలు, పునర్మిర్మాణాలు ప్రజాసౌకర్యం కోసమా లేక కాంట్రాక్టులు, రియల్ఎస్టేట్ వ్యాపారాలు, గుప్తనిధులు, స్వలాభాల కోసమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనిపై విమర్శకుల్ని మెప్పించేలా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది! అయితే ఇవన్నీ మూఢనమ్మకాలు...ట్రాష్... అని కొట్టిపారేసే శాస్త్రీయ ఆలోచనాపరులూ లేకపోలేదు. కానీ ప్రభుత్వ నిర్వాకాలు ఆ ఆలోచనాపరులకు కూడా మరో కోణంలో అనుమానాలు కలిగించేలా ఉంటుండటం గమనార్హం!