Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణం పనులకు రూ.54 కోట్లు విడుదల
- ఫిబ్రవరిలో యాగం ఏర్పాట్లకు ఆదేశాలు
- సివిల్ పనుల పరిశీలనకు ఆర్అండ్బీ సీఈ నియామకం
నవతెలంగాణ-యాదాద్రి భువనగిరి ప్రతినిధి
యాదాద్రి ప్రధానాలయ పనులు మందకొడిగా సాగడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఆలయం బయట ఉన్న పనులు పూర్తి కావడానికి ఇంకెన్నాండ్ల్లు పడుతుంది. ఇంతకు ముందు నేను చెప్పిన పనులు కూడా చేయలేదు. సంజాయిషీలు వద్దు. చెప్పడానికి మీకు సిగ్గులేకున్నా.. వినడానికి నాకైనా ఉండాలి' అంటూ వైటీడీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి కాకుంటే ఫిబ్రవరిలో యాగం ఎలా నిర్వహిస్తాం చెప్పండి అంటూ నిలదీశారు. సీఎం పర్యటన, సమీక్ష గురించి అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..
ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించేందుకు అధికారులతో కలిసి శనివారం సీఎం యాదాద్రిలో పర్యటించారు. మధ్యాహ్నం 12:05గంటలకు కొండపైకి చేరుకున్న సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే గొంగిడి సునీత, కలెక్టర్ అనిత, ఆలయ ఈవో గీత, వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్రావు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆలయ ఆర్చకులు సీఎం కేసీఆర్ను ఆలయ సంప్రదాయాలతో గుడిలోపలికి తీసుకువెళ్లారు. ప్రధానాలయం పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు.
సుమారు రెండున్నర గంటల పాటు సీఎం పనులను పరిశీలించారు. మొదటగా తూర్పు రాజగోపురం వద్దకు వెళ్లారు. ఆలయం బయట పనులు మందకొడిగా సాగటంపై ఆర్అండ్బీ, విద్యుత్శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి ఆర్అండ్బీ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని వైటీడీఏ వైస్ చైర్మెన్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 'ఏమయ్యా ఆర్అండ్బీ ఈఈ.. కిషన్రావు చెప్తుంది నిజమేనా?' అని సీఎం కేసీఆర్ అడగ్గా, అలాంటిదేమీ లేదంటూ ఈఈ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో సీఎం మరింత కోపోద్రిక్తులయ్యారు. 'వర్షం నీరు వెళ్లడానకి ఇంత పెద్ద సంపు అవసరమా?.. మీ పని ఎందుకు స్పీడ్ అవ్వడం లేదు. ఇట్టా జరిగితే ఫిబ్రవరిలో యాగం ఎట్టా చేస్తాం' అని చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. పనులను పర్యవేక్షించడానికి హైదరాబాద్లో ఉన్న ఎస్ఈని డిప్యూటేషన్పై యాదాద్రికి పంపించాలనీ, రేపు వైటీడీఏ వైస్ చైర్మెన్కు రిపోర్టు చేయమని ఉత్తర్వులు ఇవ్వండి అని ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ను అదేశించారు.
గర్భగుడి పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో రిటైనింగ్ వాల్ను పట్టుకొని ప్రహరీగోడ అంటున్నవ్? పిచ్చిగిట్టా లేసిందేంటీ? అంటూ సీఎం కేసీఆర్ అర్కిటెక్ ఆనంద్సాయిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 'నువ్వు చూపించిన మ్యాప్లు చాలు. గర్భగుడి ముందు దిమ్మె ఎందుకు ఎత్తుగా నిర్మించారని' ప్రశ్నించారు. ఆలయం బయటకు వచ్చిన తరువాత చుట్టూ ఉన్న ప్రాకారాలను పరిశీలించి శిల్పకళలు అద్భుతంగా వచ్చాయని ప్రశంసించారు. ఆ తరువాత శివాలయంను పరిశీలించిన సీఎం శివాలయంలో రామాలయమేంటీ అని అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇతర పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానాలయంతో పాటు ఇతర కట్టాడాలనూ సమాతరంగా నిర్మించాలని చెప్పినా నిర్లక్ష్యమెందుకని అధికారులకు చీవాట్లు పెట్టారు. తెప్పోత్సవం కోసం నిర్వహిస్తున్న గండి చెరువు, ఆరు లైన్ల రింగ్రోడ్డు పనులను పరిశీలించి.. ఇంకో ఐదేండ్లు పడుతుందా? అంటూ ఆర్అండ్బి అధికారులను మందలించారు. కరెంట్ స్తంభాలు తొలగించాలని గత ఫిబ్రవరి 3న వచ్చినప్పుడు చెప్పింది మర్చి పోయారా.. కరెంట్ ఈఈ ఎక్కడ అంటూ ప్రశ్నించారు.
అనంతరం హరిత హోటల్లో నాలుగు గంటలకు పైగా వైటీడీఏలోని వివిధ శాఖల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని సివిల్ అధికారులను అదేశించారు. పనుల పర్యవేక్షణ కోసం ఆర్అండ్బీ సీఈని డిప్యూటేషన్పై యాదాద్రికి పంపిస్తున్నట్టు చెప్పారు. తక్షణ అవసరాల కోసం రూ.54 కోట్లు విడుదల చేస్తున్నానని, పక్షం రోజుల్లో మరో రూ.473 కోట్లు విడుదల చేస్తానని ప్రకటించారు.సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి తదితరులు ఉన్నారు.