Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి : కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
నవతెలంగాణ- రాయికల్
రైతులకు అమలు చేస్తున్న బీమా పథకాన్ని రైతు కూలీలు, నిరుపేద కుటుంబాలకూ వర్తింపజేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి లేని కూలీలు, నిరుపేద కుటుంబాల్లో పెద్ద దిక్కు మృతిచెందితే కుటుంబాలను ఆదుకునే వారే లేరని, అలాంటి కుటుంబాలకూ రైతుల మాదిరిగానే ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. రానున్న బడ్జెట్లో బీమా పథకంపై విధివిధానాలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఇటీవల మృతిచెందిన ఇటిక్యాలలో కుంచెపు చిన్న నర్సయ్య, ఆలూరులో గల్ఫ్ కార్మికుడు రాసమల్ల గంగాధర్, రాజానగర్లో పారిశుధ్య కార్మికుడు బొమ్మెన బాలయ్య కుటుంబాలను జీవన్రెడ్డి పరామర్శించారు. వారు నిరుపేదలని, ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయమూ అందడం లేదని అన్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి నుంచి విదేశీ మారకద్రవ్యం మన ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పారు. కార్మికుల జీతాలు దేశానికి పెట్టుబడి సాయంగా ఉపయోగిస్తున్నారే తప్ప కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారని అన్నారు. గల్ఫ్ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, బీడీ, గీత, మత్స్యకార్మికులకు, భూమిలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం బీమా సౌకర్యం అమలు చేయాలని కోరారు.