Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే 370 రద్దు
- పాలకుల చేతగానితనం వల్లే ఉగ్రవాదం
- ఐద్వా రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ హక్కులపై తీవ్రమైన దాడి చేస్తున్నదని, మహిళా హక్కులను కాలరాస్తున్నదని ఆఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు అన్నారు. ఇంటిపై బీజేపీ జెండా కట్టుకుంటే మన ఇంట్లో పాము వేలాడిన్నట్టే లెక్క అని హెచ్చరించారు. మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ పబ్బం గడుపుకుంటున్నదని విమర్శించారు. స్త్రీలకు స్వేచ్చ, సమానత్వం లేకుండా పోయిందని చెప్పారు. భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను బీజేపీ తీవ్రంగా అణిచి వేస్తున్నదని విమర్శించారు. పాలకుల చేతగానితనంవల్లే దేశంలో ఉగ్రవాదం నానాటికి పెరిగిపోతుందన్నారు. శనివారం ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అధ్యక్షతన 'రాజ్యాంగ హక్కులు ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాలు' అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఐద్యా జాతీయ నాయకురాలు హైమావతి మాట్లాడుతూ బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలను మనుషులుగా చూడటం లేదన్నారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాలరాస్తూ...మతాల మధ్య చిచ్చు పెడుతున్నదన్నారు. ప్రశ్నించే గొంతుకలను చంపేస్తున్నారని, గౌరీ లంకేష్, దబోల్కర్, కల్బుర్గీ వంటి వారిని హత్య చేశారని, సినీనటుడు ప్రకాష్రాజ్ను చంపేస్తామని బెదరిస్తున్నారని చెప్పారు. ఉన్నావోలో బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెకు మద్దతు నిలిచిన కుటుంబ సభ్యులను బీజేపీ ఎమ్మెల్యే చంపినట్టు సీబీఐ విచారణలో తేలిందన్నారు. రాజ్యాంగం ప్రకారం నిరుపేదలకు ఉపాధి, విద్య, వైద్యం, గూడు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలేదన్నారు. సోషల్ మీడియాపై ఆంక్షలు పెట్టిందని విమర్శించారు. కార్పొరేట్లకు విలువైన భూములు, ఇతర సౌకర్యాలు కట్టబెట్టేందుకే బీజేపీ సర్కారు 370 ఆర్టికల్ను రద్దు చేసిందని ఆరోపించారు. మల్లు లక్ష్మి మాట్లాడుతూ బీజేపీ సర్కారు స్త్రీస్వేచ్ఛను అణచివేస్తున్నదని, మహిళలపై లైంగికదాడులు, అత్యాచారాలు, వేధింపులు మరింత పెరిగిపోయాయన్నారు. ప్రజల తిండిపై, కట్టుకునే బట్టలపై ఆంక్షలు పెట్టి అణచివేస్తుందని విమర్శించారు. సినీనటుడు అనురాగ్ కశ్యప్ నాయకత్వంలో 15 మంది నటులు దేశంలో కొనసాగుతున్న మూకదాడులపై మోడీకి ఫిర్యాదు చేసినందుకు ఆయన్ను మతోన్మాదులు బెదిరిస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఐద్వా జాతీయ నాయకులు ఆశాలత మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయలేదనీ, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పుల్వామా దాడి చేసిందని ఆరోపించారు. ఐద్వా సెంట్రల్ సిటీ కార్యదర్శి అరుణజ్యోతి మాట్లాడుతూ భిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి జీవిస్తున్న లౌకిక దేశంలో బీజేపీ సర్కారు విభజించు, పాలించు అన్న దోరణితో వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సౌత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మమ్మ, శశికళ, మేడ్చల్ జిల్లా ఐద్వా కార్యదర్శి వినోద, విజయలక్ష్మి, స్వర్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.