Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏర్గట్ల
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్లో 25 గంగపుత్రుల కుటుంబాల గ్రామ బహిష్కరణ ఘటనపై ఇన్చార్జి ఎస్ఐ సంపత్ కుమార్ యాదవ్, తహసీల్దార్ వెంకట్రావ్ శనివారం విచారణ చేపట్టారు. గంగపుత్రులు మినహా గ్రామంలోని ప్రతి సంఘం నుంచీ ఇంటికి ఒక్కరు చొప్పున పోలీస్స్టేషన్కు వచ్చారు. మొదట బహిష్కరణకు గురైన 25 కుటుంబాల వారిని, గంగపుత్ర సంఘం జిల్లా, రాష్ట్ర నాయకులను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. కిరాణాషాపుల్లో వస్తువులు ఇవ్వడం లేదని, టీ కొట్టులో టీ తాగకుండా, బీడీలు చుట్టకుండా ఆంక్షలు విధించారని, మటన్, చికెన్ ఇవ్వకుండా చేశారని తెలిపారు. తమ పొలాల్లో నాట్లు వేసేందుకు కూలీలు దొరక్కపోతే పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చుకుంటున్నామని గంగపుత్రులు వివరించారు. అనంతరం వీడీసీ సభ్యులను విచారించారు. తాము వారిని బహిష్కరణ చేయలేదని, ఏమైనా అనుమానం ఉంటే గ్రామంలో విచారించొచ్చని అన్నారు. ఇరువురిని విచారించిన తర్వాత ఎస్ఐ సంపత్కుమార్ యాదవ్ గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారితో పాటు రెవెన్యూ సిబ్బందిని పంపారు. ఒకవేళ గంగపుత్రులకు గ్రామంలో సహాయం నిరాకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విచారణను కొనసాగిస్తున్నట్టు తెలిపారు.