Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్
నవతెలంగాణ - పాలకవీడు
ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో కృష్ణమ్మ వరద ఉధృతికి ముంపునకు గురైన మహంకాళీగూడెం, రావిపహాడ్, గంగాభవానిపురం, గుండెబోయినగూడెం గ్రామాలను ఆయన శనివారం పరిశీలించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఐ జైపాల్రెడ్డి అందించిన ఆర్థికసాయంతో గంగాభవానిపురంలో 40 జాలర్ల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి 40 కేజీల బియ్యం, మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. వరదల వల్ల అంధకారంలో ఉన్న గ్రామాల్లో వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని, తాగునీటిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. మైనింగ్ ఫండ్ కింద వచ్చే నిధులు మైనింగ్ పరిధిలోని గ్రామాలకు చెందాల్సి ఉండగా మంత్రి జగదీశ్వర్రెడ్డి తన సొంత నియోజకవర్గానికి మళ్లించారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. తక్షణమే ఆస్పత్రులకు నిధులు కేటాయించాలని, పేదలకు వైద్యం అందించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి, ఎంపీపీ భూక్యా గోపాల్, ఎన్ఆర్ఐ జైపాల్రెడ్డి తదితరులున్నారు.