Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60తులాల బంగారు ఆభరణాలు,
- 2కిలోల వెండితోపాటు ఇతర వస్తువుల స్వాధీనం
- 12 కేసులను ఛేదించిన ఓయూ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మూడు కమిషనరేట్ల పరిధిల్లో దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ను ఓయూ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆరుగురు ముఠా సభ్యుల్లో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 22లక్షల విలువ చేసే 60తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండితోపాటు ఫోర్డు కార్ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బషీర్బాగ్లోని పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ నిందితుల వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్కు చెందిన మనిషా డిస్కో, అలీఖాన్, రూపాబారులు పార్థీ గ్యాంగ్ ముఠాలోని సభ్యులు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకునే ఈ ముఠా చాకచక్యంగా తాళాలను తొలిగించి ఇంట్లోకి వెళ్లి బంగారం, వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు, డబ్బులను ఎత్తుకెళ్తారు. మనీషా డిస్కో దోపిడీలకు పథకం వేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలో కారులో సంచరిస్తూ తాళాలున్న ఇండ్లను టార్గెట్ చేస్తుంది. అనంతరం ముఠా సభ్యులను రైళ్లలో రప్పిస్తుంది. ముఠా సభ్యులు ఇద్దరు చొప్పున విడిపోయి టార్గెట్ చేసుకున్న ఇండ్లలో దోపిడీలు చేస్తారు. ఇదే తరహాలో జులై మాసంలో తార్నాకాలో తాళాలేసిన ఇంటిని టార్గెట్ చేశారు. వంటగదిలోంచి ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుమేరకు విచారణ చేపట్టిన ఓయూ డీఐ రమేష్ నాయక్, డీఎస్ఐ పి.గంగాధర్ రెడ్డిలు మధ్యప్రదేశ్కు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. 2014 నుంచి నేరాల బాటపట్టిన ఈ ముఠాపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ మూడు కమిషనరేట్లతోపాటు వరంగల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలల్లో కేసులున్నాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు 12కేసులను ఛేదించామన్నారు. గ్యాంగ్లో ఆరుగురు ముఠా సభ్యులున్నారన్నీ, ఇప్పటివరకు వీరు ఎక్కడా అరెస్టు కాలేదన్నారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో విచారించిన ఓయూ ఎస్హెచ్ఓ ఎస్.రాజశేఖర్రెడ్డిని సీపీ ప్రత్యేకంగా అభింనదించారు. సమావేశంలో ఏసీపీ ఎస్.సుధాకర్, అదనపు డీసీపీ గోవర్ధన్ రెడ్డితోపాటు కానిస్టేబుళ్లు నవీన్, చంద్రశేఖర్, జగదీష్, సంతోష్, మల్లిఖార్జున్, మురళీ, మహిళా కానిస్టేబుళ్ దీనా పాల్గొన్నారు.