Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాల సవరణను కార్మికులు ఐక్యంగా వ్యతిరేకించాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-పటాన్చెరు
ఎన్నికలను మోడీ ప్రభుత్వం ఉగ్రవాదం వైపు మళ్లించిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. ప్రధానిగా ప్రజాసంక్షేమానికి పాటుపడాల్సిం దిపోయి పెట్టుబడుదారుల కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. సీఐటీయూ సంగారెడ్డి జిల్లా రెండో మహాసభ పటాన్చెరు పారిశ్రామికవాడలో శనివారం ప్రారంభమైంది. మొదటిరోజు పట్టణంలోని అంబేద్కర్చౌక్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో రాములు మాట్లాడారు. పెట్టుబడిదారుల అవసరాల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. దేశభక్తిని తెరమీదకు తీసుకురావడమంటే అంబానీ, ఆదాని ఆస్తులను రక్షించడమేనని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చినప్పుడే నిజమైన దేశభక్తి అన్నారు. ప్రస్తుతం దేశంలో కార్మికులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. పరిశ్రమలు మూతపడి కార్మికుల ఉద్యోగ భద్రత గాలిలో దీపంలా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలవగానే, కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చెప్పడమంటే కార్మికుల హక్కులను కాలరాయడమేనని అన్నారు. నాలుగు చట్టాలను వేజ్కోడుగా విభజించారన్నారు. చట్టాల సవరణను కార్మికులు వ్యతిరేకించి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు మల్లికార్జున్, జయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య, ఉపాధ్యక్షులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.