Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో నెంబర్ 15 ను వెంటనే అమలుచేయాలి
- భాషా పండితుల నిరాహారదీక్షలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్
రోజురోజుకూ పెరిగిపోతున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ఉద్యమంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. శనివారం ఇందిరాపార్కు వద్ద రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ-టీ), వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (పీఈటీఏ-టీఎస్) సంయుక్తాధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రయివేటీకరణపై దృష్టి పెడుతూ ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర పన్నుతోందనీ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందనీ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న ఉపాధ్యాయులు ఒకే వేదికమీదకు వచ్చి తమ సమస్యలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఓట్లకోసం మాత్రమే అన్నట్టు జీవో నెంబర్.15 తెచ్చి అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలంటే వెంటనే జీవో నెంబర్.15ను అమలుచేస్తూ పండిట్, పీఈటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాసనమండలిలో ప్రభుత్వ విధానాలపై గొంతు విప్పి ప్రభుత్వం స్పందించే విధంగా పోరాడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నమ్మకద్రోహి అని అన్నారు. ప్రజా సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను, ఆర్టీసీని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ భాషా పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని హితవు పలికారు. దీక్షకు ఎమ్మెల్సీ రామచంద్రరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావరవి, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ నీలవెంకటేశ్ మద్దతు తెలిపారు. ఆర్యూపీపీ-టీ అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గండమల్ల విశ్వరూపం, పీఈటీఏ అధ్యక్షులు ఎస్.సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జి.రాఘవ రెడ్డి దీక్షలో కూర్చొనగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.