Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిట్టుకుంటున్నవారే పార్లమెంట్లో ఒకే చట్టానికి ఓట్లు
- సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఎలాంటి నిర్భంధంలో రద్దు చేశారో.. అలాంటి ప్రయోగం ద్వారానే కార్మిక చట్టాలను పాలకవర్గాలు రద్దు చేసే ప్రమాదం ఉందని సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సరళీకరణ, నూతన ఆర్థిక విధానాల కారణంగా మానవ జీవితాలన్నీ ధ్వంసమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ స్వర్ణోత్సవాలు, రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా ఈసీఐఎల్లో 'సంస్కరణలు- పారిశ్రామిక రంగంపై ప్రభావం' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన జరిగిన సదస్సులో బీవీ రాఘవులు మాట్లాడుతూ... సరళీకరణ ఆర్థిక సంస్కరణల ప్రభావం పారిశ్రామిక, వ్యవసాయ, విద్యా, ఆరోగ్య, సాంస్కృతిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ముఖ్యంగా మనిషి జీవితానికి సంబంధించిన అన్ని రంగాలపై ప్రభావం ఉందన్నారు. రాజకీయ పార్టీల నాయకులంతా మనముందు శత్రువులుగా నటిస్తూ పెద్ద పెద్ద తిట్ల దండకాలకు దిగుతున్నారనీ, కానీ వారంతా పార్లమెంటులో ఒకే చట్టానికి ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఓట్లు వేసుకుని పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూలమైన చట్టాలు చేస్తున్నారనీ తెలిపారు. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల అమలు ఫలితంగా ప్రజల్లో తీవ్రమైన అసహనం పెరిగిందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రయివేటు పరం చేయడమే
కార్మిక చట్టాలు రద్దు చేసే ప్రమాదం దీని ముఖ్యోద్దేశమన్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను, రూ.700 కోట్లు విలువ చేసే నిజామాబాద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని రూ.70 కోట్లకే అమ్మేశారని చెప్పారు. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన 60 ఆస్తులను అమ్మేందుకు రంగం సిద్ధమైందన్నారు. దేశవ్యాప్తంగా 1 లక్ష మంది పనిచేస్తున్న దేశ రక్షణ రంగాన్ని స్వదేశీ, విదేశీ వ్యక్తులకు అమ్మేస్తున్నారనీ, రానున్న రోజుల్లో కార్మికుల రక్షణ, అవసరాలను నిర్ణయించే హక్కు పెట్టుబడిదారులు, యాజమానులకు దక్కనుందనీ ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 విభాగాలు చేయడాన్ని విమర్శించారు. కేంద్రం చేసిన కార్మిక చట్టాల సవరణను కార్మికవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు డీజీ నరసింహరావు, సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జే చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కె.రవి, నాయకులు సత్యం, చింతల యాదగిరి, శ్రీనివాసులు, లింగస్వామి, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి కొండూరి భాస్కర్ పాల్గొన్నారు.