Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరవధిక పోరాటానికి ఉద్యోగులు సన్నద్ధం
- కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సంపూర్ణ మద్దతు
- రక్షణ శాఖ కార్పొరేటీకరణ ప్రమాదకరం
- పెట్టుబడిదారుల కోసమే వందశాతం ఎఫ్డీఐ ఆహ్వానం
- కేంద్రం నిర్ణయాలు వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమం:రౌండ్టేబుల్లో వక్తల పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశం కోసం రక్షణ రంగంలోని అన్ని ఫెడరేషన్లు, అసోసియేషన్లు జేఏసీగా ఏర్పడి 30 రోజులపాటు చారిత్రక సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఒకరోజు, రెండు రోజులు, 72 గంటలపాటు సమ్మెలు జరిగాయి. ఏకంగా 30 రోజులపాటు సమ్మె జరగడం చారిత్రాత్మకమే. దేశ రక్షణ, ప్రజల ప్రయోజనాల కోసమే నిరవధిక పోరాటానికి పూనుకుంటున్నాయి. ఈ సమ్మెకు కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే ఈ సమ్మెలో రక్షణ శాఖ ఉద్యోగులే కాకుండా ఇతర సంస్థల కార్మికులు, ఉద్యోగులు, ప్రజానీకాన్ని భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిరంకుశ విధానాల వల్ల దేశానికి ఎంత ప్రమాదం పొంచిఉందో ప్రజలకు వివరించి చైతన్యపరచాలని వివరించాయి. రక్షణ శాఖ ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ దేశానికి ఎంతో ప్రమాదకరమని వెల్లడించాయి. కార్పొరేట్లు, పెట్టుబడిదారుల కోసమే రక్షణ రంగంలోకి వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)ని ఆహ్వానించిందని విమర్శించాయి. 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ దేశానికి నష్టం కలిగిస్తుందని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రక్షణరంగానికి, దేశానికి నష్టం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకూ ఐక్య ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చాయి. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమ్ెం ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ (సీసీజీఈడబ్ల్యూ), అఖిల భారత రక్షణ ఉద్యోగుల సమాఖ్య (ఏఐడీఈఎఫ్)ల సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది.
ఇది దేశభక్తి సమ్మె : పాలడుగు భాస్కర్
రక్షణ శాఖ ఉద్యోగులు చేపట్టిన 30 రోజుల సమ్మె దేశభక్తియుతమైందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. కార్మిక సంఘాలు ఆర్థిక సమస్యలపైనే సమ్మె చేస్తాయని అందరూ భావిస్తారని చెప్పారు. కానీ దేశం కోసం, ప్రజల కోసం రక్షణ ఉద్యోగులు ఈ సమ్మె తలపెట్టారని వివరించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ సమ్మె జరుగుతోందని అన్నారు. ఆర్థిక స్వావలంబన, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలున్నాయని చెప్పారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ మాట్లాడుతూ 30 రోజులసమ్మె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఓ మరమనిషి ఈ దేశాన్ని పాలిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. రక్షణ రంగాన్ని ప్రయివేటీకరించడమంటే దేశాన్ని, సైనికులను బలిచేయ డమే అవుతుందన్నారు. హెచ్ఎంఎస్ నేత ఉదరుభాస్కర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే దేశభక్తుడు లేదంటే దేశద్రోహి అన్నట్టుగా ఉందన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ మోడీ అన్ని రంగాలనూ ప్రయివేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాఉద్యమం ద్వారానే రక్షణరంగాన్ని ప్రయివేటీకరించే నిర్ణయాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీఎన్టీయూసీ నేత ఎంకె బోస్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం, ఏఐయూటీయూసీ నేత భరత్ మాట్లాడుతూ రక్షణరంగాన్ని కాపాడుకుంటేనే దేశానికి మేలు కలుగుతుందని అన్నారు. అధ్యక్షత వహించిన సీసీజీఈడబ్ల్యూ ఏపీ, తెలంగాణ విభాగం చైర్మెన్ వి నాగేశ్వర్రావు మాట్లాడుతూ దేశ స్వావలంబనకు ప్రమాదం వచ్చేలా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. పెట్టుబడిదారుల లాభాపేక్ష కోసమే రక్షణరంగాన్ని ప్రయివేటీకరిస్తున్నారని చెప్పారు. ఏఐడీఈఎఫ్ సంయుక్త కార్యదర్శి జిటి గోపాలరావు మాట్లాడుతూ దేశంలో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, 9 శిక్షణా కేంద్రాలున్నాయని అన్నారు. పాక్, చైనా, కార్గిల్, బంగ్లా, సర్జికల్ స్ట్రైక్లో సైన్యానికి అవసరమైన పరికరాలు, ఆయుధాలు సరఫరా చేస్తూ 4వ ఆర్మి విభాగంగా సేవలందిస్తున్నామని వివరించారు. సైన్యానికి, నేవీ, ఎయిర్ ఫోర్స్లకు అవసరమైన యుద్ధ పరికరాలు, ఆధునీకరించిన ట్యాంకర్లు, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, తుపాకులు వంటి వాటిని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నుంచి కార్పొరేట్, విదేశీ సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇది దేశ సమగ్రతకు విఘాతం కలిగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 20 నుంచి వచ్చేనెల 19వ తేదీ వరకు 30 రోజులపాటు చేపట్టే నిరవధిక సమ్మెకు పూనుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీసీజీఈడబ్ల్యూ ఏపీ, తెలంగాణ విభాగం ప్రధాన కార్యదర్శి ఎ అజీజ్, ఏఐడీఈఎఫ్ నాయకులు ఈశ్వరప్రసాద్, సత్యనారాయణ, సురేష్, జె వెంకటేష్ (సీఐటీయూ), వంగూరు రాములు (భవన నిర్మాణ కార్మిక సంఘం), ఎంఎన్ రెడ్డి (పింఛనర్లసంఘం), వెంకట్రామయ్య, రాధేశ్యాం (బీఈఎఫ్ఐ), పి మాణిక్రెడ్డి (టీఎస్యూటీఎఫ్), కె శ్రీకాంత్గౌడ్ (డీఆర్డీవో), సురేష్బాబు (డీఆర్డీఎల్) తదితరులు పాల్గొన్నారు.