Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక చట్టాల సవరణ వెంటనే ఉపసంహరించుకోవాలి: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-రామచంద్రాపురం
బీజేపీ విధానాల వల్ల కార్మికుల్లో అసంతృప్తి చెలరేగిందనీ, కార్మిక హక్కులను కుదించి కార్మికవర్గ హక్కులపై దాడికి కేంద్రం పాల్పడుతుందనీ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. కార్మిక చట్టాల సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బాలాజీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఆ సంఘం జిల్లా మహాసభలు ఆదివారం రెండోరోజు జిల్లా నాయకులు నర్సింహారెడ్డి, బి.మల్లేశ్ అధ్యక్షతన సాగాయి. మహాసభలకు చుక్క రాములుతో పాటు కార్యదర్శులు జయలక్ష్మి, మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటుపరం చేసేందుకు పూనుకుంటోందన్నారు. డిఫెన్స్ కంపెనీలనూ ప్రయివేటుపరం చేసే ఆలోచనలను సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఎన్నడూ లేనివిధంగా డిఫెన్స్ కంపెనీలో పనిచేసే కార్మికులు సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా 44 చట్టాలకు 4 కోడ్లుగా మార్చి, వారి హక్కులపై ఉక్కుపాదం మోపిం దన్నారు. ప్రపంచ దేశాల్లో రోజురోజుకూ రూపాయి విలువ బలహీన పడుతోందనీ, జీడీపీ తగ్గుదల, విదేశీ పెట్టుబడులు సైతం చాలా మటుకు తగ్గాయనీ వివరించారు. ప్రజాస్వామ్యానికే పెనుముప్పులా బీజేపీ విధానాలు ఉన్నాయన్నారు. కార్మికులకు కనీస వేతనాలు రూ.18 వేలు ఉండాలని డిమాండ్ చేశారు. మహాసభలో సీఐటీయూ నాయకులు రాజయ్య, పాండురంగారెడ్డి, మహిపాల్, నాగేశ్వరరావు, సాయిలు, యాదవరెడ్డి పాల్గొన్నారు.