Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యశాఖ మంత్రి ఈటల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దళితులు సమాజంలో ఆత్మగౌరవంతో బతకాలనీ రాష్ట్ర, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని విశ్వేశరయ్య భవన్లో ఎస్సీ, ఎస్టీ హక్కుల పోరాట సంస్థ ఆధ్వర్యంలో భారతదేశంలో పేదరికంపై జరిగిన చర్చా గోష్టికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ వేల ఏండ్లుగా సమాజంలో అడుగడుగునా అణగదొక్కబడ్డ ఎస్సీ, ఎస్టీలు తమ హక్కుల సాధన కోసం నేడు కూడా పోరాడాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారు. ఒకప్పుడు పరిశ్రమలు, ఇతర వ్యాపార, వాణిజ్య రంగాలు సమాజహితం కోసం స్థాపించబడ్డాయని, కాని నేడు ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ విధానాల వల్ల దేశంలో ఉత్పత్తి రంగాలు వ్యక్తుల హితం కోసం మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీకీ కాంట్రాక్ట్, ఔట్సోర్సీంగ్ విధానం అమలు చేస్తుండడంతో రిజర్వేషన్లను దళితులు కోల్పోతున్నారని తెలిపారు. కేవలం ఉద్యోగాల సాధనే లక్ష్యంగా కాకుండా తమ ప్రతిభను ఇతర రంగాలకు మళ్లించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ దేశంలో 15శాతంకూడా లేని అగ్రవర్ణాలు పథకం ప్రకారం 85శాతం ఉన్న అట్టడుగు వర్గాలను అణగ దొక్కుతున్నారని అన్నారు. విభజించు పాలించు సూత్రాన్ని పాటిస్తూ మనలోనే వైషమ్యాలను పెంచుతున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన దాదాపు 10లక్షల సంస్థలు ఉండగా, అందులో 2లక్షలు రిజిస్టర్డ్ సంస్థలని తెలిపారు. మనలోనే ఇన్ని సంఘాలు ఉంటే ఐక్యత ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విభేదాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం పోరాటం చేయాలని కోరారు. ఈ సమవేశంలో వికారబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, తెలంగాణ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ వి.ప్రకాష్రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జే. సుధాకర్బాబు, ఎస్సీ, ఎస్టీ హక్కుల పోరాట సంస్థ అధ్యక్షులు. జి.మురళీధర్రావు పాల్గొన్నారు