Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
- బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యక్రమాలకు ప్రశంస
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రజల కోసమే కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్టు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీ, మున్సిపల్ చట్టాలను తెచ్చామని, వీటివల్ల ప్రజల్లో అసమానతలు తగ్గుతాయని చెప్పారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో వివేకానంద విదేశీ విద్యా పథకం క్రింద ఎంపికైన విద్యార్ధులకు ఆయన చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కండ్లు వంటివని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 3,600 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం నెలకు రూ. 6వేలను ప్రభుత్వం ఇస్తున్నదని, ఈ ఏడాది మరో 1,200 దేవాలయాలను కూడా ఈ జాబితాలో చేరుస్తున్నట్టు వివరించారు. విద్యావంతులకే సమాజంలో గౌరవం ఉంటుందని, విద్యకు కులం, మతంతో సంబంధం లేదని అన్నారు. బ్రాహ్మణులకు గతంలో ఎలాంటి గుర్తింపు లేదని, సీఎం కేసీఆర్ మాత్రం వారి విద్యను, త్యాగాన్ని గుర్తించి గౌరవ మర్యాదలు ఇస్తున్నారని చెప్పారు. యధారాజా...తధా ప్రజా అంటారని, తొలుత రాజు గౌరవిస్తే, ప్రజలు కూడా అంతే గౌరవాన్ని బ్రాహ్మణులకు ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పరిషత్ చైర్మెన్ కేవీ రమణాచారి మాట్లాడుతూ వివిధ పథకాల ద్వారా లబ్దిపొందేందుకు ఎవరూ దళారుల్ని ఆశ్రయించొద్దని విజ్ఞప్తి చేశారు. పూర్తి పారదర్శకత కోసం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నామన్నారు. ఏవైనా అవకతవకలు జరిగితే తక్షణం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తామన్నారు. మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ పరిషత్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్యాపథకం క్రింద ఒక్కో విద్యార్ధికి రూ.20 లక్షలు మించకుండా 54 మందికి ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్టు వివరించారు. ఆర్ధికశాఖ అభ్యంతరాల వల్ల కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, త్వరలోనే సీఎం కేసీఆర్ను కలిసి సమస్యల్ని పరిష్కరించాలని కోరతామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్కుమార్, సీఎమ్ఓ సీపీఆర్ఓ వనం జ్వాలా నర్సింహారావు, పరిషత్ సభ్యులు అష్టకాల రామ్మోహన్రావు, జోషీ గోపాలశర్మ, బండారు శేషగిరిరావు, ఎస్ సుమలతాశర్మ, డాక్టర్ సువర్ణాసులోచన తదితరులు పాల్గొన్నారు.