Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది నుంచి సరఫరా లేదు..
- రికార్డుల్లో వేసినట్టు నమోదు
- ఐదేండ్ల లోపు చిన్నారులకు అందని విటమిన్ ఏ సిరప్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒక వైపు కంటి వెలుగు కార్యక్రమం, మరో వైపు అంధత్వ నివారణే తమ లక్ష్యమంటూ ప్రచారం చేసుకుంటున్న సర్కారు ఐదేండ్లలోపు చిన్నారుల కంటి చూపును కాపాడే విటమిన్ ఏ సిరప్ ను మాత్రం సరఫరా చేయడం లేదు. పైపెచ్చు సిరప్ వేయకపోయినా వేసినట్టుగా కేసీఆర్ కిట్ కు సంబంధించిన పోర్టల్ లో కనిపిస్తున్నది. ఎంఆర్ తదితర వ్యాక్సిన్ల వేసే సమయంలోనే విటమిన్ ఏ సిరప్ను వేయాల్సి ఉండడంతో వాటన్నింటిని కలిపి పోర్టల్ లో ఒకే కాలమ్ క్రింద చూపించడంతో ఈ సమస్య తలెత్తినట్టు ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. మరో వైపు రోగులు మాత్రం సంవత్సర కాలంగా విటమిన్ ఏ సిరప్ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలపై ఒత్తిడి తెస్తున్నారు. అదిగో వస్తుంది... ఇదిగో వస్తుందంటూ చెబుతూ ఆరోగ్య కార్యకర్తలు వారికి నచ్చచెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 మిలియన్ల మంది చిన్నారులు విటమిన్ ఏ లోపం కారణంగా దృష్టి లోపం, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదేండ్లలోపు చిన్నారులకు విటమిన్ ఏ సిరప్ ను తప్పనిసరిగా వేయాలని సూచించింది. రాష్ట్రంలో ఐదేండ్లలోపు చిన్నారులు దాదాపు 40 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. 10 నెలలకు ఒకసారి, తిరిగి సంవత్సరన్నర నుంచి ప్రతి ఆరు నెలలకు ఒక డోసు చొప్పున వేయాల్సి ఉంటుంది. ఒక బాటిల్ ధర రూ.100 నుంచి రూ.250 లోపే ఉంటుందనీ, ఒక్కో బాటిల్లో 50 మంది వరకు చిన్నారులకు వేయవచ్చని తెలుస్తుంది. సంవత్సరానికి ఒక సబ్ సెంటర్ కు ఒకట్రెండు బాటిల్స్ సరఫరా చేస్తే సరిపోతుందని ఇంత తక్కువ ఖర్చు అయినప్పటికీ సరఫరా నిలిచిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఔషధ సరఫరా కంపెనీలు అధిక ధరలు కోట్ చేస్తున్నందున టెండర్లు ఖరారు ఆలస్యమైనట్టు అధికారులు చెబుతున్నారు. అయితే గత సంవత్సరం కాలం నుంచి విటమిన్ ఏ సిరప్ వేయని పిల్లల పరిస్థితి ఏంటనే విషయంపై మాత్రం మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. పైపెచ్చు ఎంఆర్ లాంటి వ్యాక్సిన్ వేసినప్పుడు దానితో పాటు విటమిన్ ఏ సిరప్ ఇచ్చినట్టు పోర్టల్ లో అప్ లోడ్ అవుతున్నా దాన్ని పట్టించుకోవడం లేదు. చేప కాలేయపు నూనె, పాలు, వెన్న, గుడ్డు సొన మొదలైన వాటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. క్యారట్, ఆకుకూరలలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. మొక్కలలో ఇది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది కాలేయం, పేగులలో విటమిన్ ఏగా మారుతుంది.కంటి చూపును మామూలుగా ఉంచడంలో విటమిన్ ఏ ముఖ్య పాత్ర వహిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లోపిస్తే రేచీకటి వ్యాధికి గురై తక్కువ వెలుతురులో, రాత్రిపూట వస్తువులను చూడలేరు. రెటీనాలోని కోన్లలో ఉండే దృష్టి వర్ణకాల లోపం వల్ల ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించలేరు. కంటి ముందుభాగంలో ఉండే కార్నియా అనే పారదర్శకమైన పొర మెత్తగా అయ్యి, పగులుతుంది. దీనివల్ల దృష్టి పోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది. చర్మం పొలుసుల్లా, గరుకుగా మారుతుంది. ప్రత్యుత్పత్తి చర్యల మీద కూడా ప్రభావం చూపుతుందని వైద్యాధికారులు, నిపుణులు వివరిస్తున్నారు. చిన్నారుల కంటి చూపును కాపాడే విటమిన్ ఏ సరఫరాను వెంటనే చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అలాంటిదేమి లేదు - డాక్టర్ సుధీర
విటమిన్ ఏ సిరప్ సరఫరా లేదని, వేసినట్టుగా నమోదు చేయడం లాంటిదేమి లేదని వైద్యఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర తెలిపారు. తప్పుగా పోర్టల్ లో నమోదవుతున్న విషయంపై నవతెలంగాణ ప్రతినిధి ఫోన్ లో సంప్రదించగా, కంపెనీలు ధరలను అధికంగా కోట్ చేస్తుండడంతో సేకరణలో ఇబ్బందులు తలెత్తాయయన్నారు. సాధ్యమైనంత తొందరగా విటమిన్ ఏ సిరప్ ను సేకరించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.