Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదక్ జిల్లాలో మరో దారుణం
నవతెలంగాణ-మెదక్
ఇటుక బట్టీలో పనిచేసే కార్మికురాలిపై సామూహిక లైంగికదాడి జరిగిన మరుసటి రోజే మెదక్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. మహిళా కూలీపై దుండగులు లైంగికదాడికి పాల్పడి ఆపై ఆమెను హతమార్చారు. ఈ సంఘటన మెదక్ మండలం అవుసులపల్లి గ్రామ శివారులో ఆదివారం వెలుగులోకి రావడం సంచలనం రేపింది. డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... ఔరంగాబాద్ స్కూల్ తండాకు చెందిన కెతవత్ విజయ (26), భర్త కేతవత్ దేవ్ల కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. శనివారం కూలీ పనికి వెళ్తున్నానని చెప్పి విజయ ఇంటి నుంచి బయల్దేరింది. రాత్రికి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన భర్త తెలిసిన వారి వద్ద ఆరాతీశాడు. ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం అవుసులపల్లి గ్రామానికి చెందిన బోయినిపల్లి విష్ణువర్ధన్ తన పోలానికి వెళ్లాడు. అక్కడ విజయ మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమందించాడు. డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, రూరల్ ఎస్ఐ లింబాద్రి అక్కడికి చేరుకుని డాగ్స్క్వాడ్, క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, ఇతర సామాగ్రి పడి ఉన్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.