Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి
- వాస్తు పేరిట సచివాలయం కూల్చివేత దారుణం
- తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం అన్యాయం
- టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే : బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షలు జె.పి.నడ్డా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు కమీషన్లమయమైపోయాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు. వాస్తుపేరిట సచివాలయం కూల్చివేయడం దారుణమని, దీని వెనుకా అవినీతి దాగి ఉందని విమర్శించారు. కొత్త సచివాలయం కట్టినా, ఇంకేం చేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నొక్కి చెప్పారు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్రావు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. 'నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక దక్షిణ భారతదేశ ముఖ ద్వారం అయిన తెలంగాణకు వచ్చా. చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం నాకు కావాలి' అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు రజాకార్లను తరిమికొట్టారని, నిరంకుశ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు వల్లభాబారు పటేల్ విముక్తి కలిగించారని అన్నారు. కాంగ్రెస్కు దేశ భవిష్యత్తు పట్టదని విమర్శించారు. జమ్మూకాశ్మీర్కు విషయంలో కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్లలో చేయనిది తాము చేసి చూపెట్టామన్నారు. ఒకే దేశం-ఒకే రాజ్యాంగం కలను ప్రధాన మంత్రి మోడీ సాకారం చేశారన్నారు. త్వరలోనే దేశ ఆదాయం 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ప్రతి ఒక్క కుటుంబానికీ టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించాలనే ధృడసంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నామని, ప్రధాని ఆవాస్ యోజనలో ప్రతి పేదకూ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. ప్రతి స్వయం సహాయక బందానికి రూ.5లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అత్యున్నతమైన పథకమని, రూ.5 లక్షల వరకు హెల్త్ స్కీమ్ వర్తిస్తుందని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం అమలు చేస్తుండగా...తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకంలో రూ.1500 కోట్ల బకాయిలను చెల్లించాలని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయని, మరోపక్క మెడికల్ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారని, ఈ పరిస్థితుల్లో పేదలకు వైద్యం అందని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు. అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు ఎక్కువైపోయాయని, అందుకు బీజేపీ మినహాయింపు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 మంది సీఎంలు రూ.60 వేల కోట్ల అప్పుచేస్తే...ఐదున్నరేండ్లల్లో సీఎంగా కేసీఆర్ లక్షా 20 వేల కోట్ల రూపాయల అప్పు చేశారని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో బడులు మూస్తేస్తున్నారని, బార్లు తెరుస్తున్నారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామాకాలు అంటూ తెచ్చుకున్న తెలంగా ణలో ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్రావు మాట్లాడుతూ... టీడీపీ ఆవిర్భావం నుంచి 37 ఏండ్ల పాటు ఏ పదవీ ఆశించకుండా పనిచేశానని, కష్టకాలంలో ప్రతిసారీ చంద్రబాబు వెన్నంటే ఉన్నానని ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకు న్నారు. తెలంగాణ టీడీపీ నేతలు తమ స్వప్రయోజనాల కోసం ఇక్కడ పార్టీని ఆగం చేశారని విమర్శించారు. అందుకే టీడీపీ నేతలమంతా బీజేపీలో చేరామన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు భరోసానివ్వడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమ య్యారన్నారు. పాల్వాయి రజని మాట్లాడుతూ...టీడీపీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ కన్నీరు పెట్టుకు న్నారు. చింతా సాంబమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి కృష్ణదాస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఎంపీలు అరవింద్, బాబూరావు, బండి సంజరు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నేతలు పేరాల చంద్రశేఖర్, బండ్రు శోభారాణి, డీకే అరుణ, జితేందర్రెడ్డి, పెద్దిరెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, పొంగులేటి సుధాకర్రెడ్డి, విజయరామారావు, బోడ జనార్ధన్, బాబూమోహన్, సంకినేని వెంకటేశ్వర్లు, విజరుపాల్రెడ్డి, మువ్వా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.