Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో కరెంటు వినియోగం అస్తవ్యస్తం
- సమగ్ర విద్యుత్ విధానం అవసరం
- తెలంగాణ మినహా దేశమంతా విద్యుత్ కోతలే:పీఎఫ్సీ సీఎండీతో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలో ఇంకా చీకటి ప్రాంతాలు ఉన్నాయంటే...దానికి పాలకుల తప్పిదాలే కారణమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న స్థాపిత ఉత్పత్తి సామర్ధ్యంలో సగం విద్యుత్ను కూడా వినియోగించుకోవట్లేదని చెప్పారు. తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయన్నారు. అన్నిరంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం దేశవ్యాప్తంగా సమగ్ర విద్యుత్ విధానం అవసరమని చెప్పారు. ఆ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తే దేశంలో చీకటి గ్రామాలంటూ ఉండవని స్పష్టం చేశారు. దీనికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విద్యుత్ విజయాలే ప్రత్యక్ష ఉదాహరణలు అని వివరించారు. తెలంగాణ మినహా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అమల్లో లేదని గుర్తుచేశారు. ఫలితంగా వ్యవసాయ దిగుబడి పెరిగిందని, స్థూల రాష్ట్రోత్పత్తి వృద్ధి చెందిందని తెలిపారు. పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) సీఎమ్డీ రాజీవ్శర్మ మూడు రోజుల రాష్ట్ర పర్యటన పూర్తిచేసుకొని శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా వారిమధ్య దేశ, రాష్ట్ర విద్యుత్ స్థితిగతులపై విస్త్రుత చర్చ జరిగింది. టీఎస్జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్రావు, కార్యదర్శులు స్మితాసభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో పర్యటించి వచ్చిన పీఎఫ్సీ సీఎమ్డీ రాజీవ్శర్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సమగ్ర వ్యూహంతో ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తివేశామని, ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని వివరించారు. లోఓల్టేజీ సమస్య, ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణ కోసం పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచామని చెప్పారు..
ప్రస్తుతం 20వేల మెగావాట్ల విద్యుత్ను వాడుకోవడానికి అనుగుణమైన వ్యవస్థ సిద్ధమైందని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థలను తీర్చిదిద్దడంతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులకు సైతం పీఎఫ్సీ అందించిన ఆర్థిక సహకారం ఎంతో దోహదపడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా పీఎఫ్సీ చైర్మెన్ రాజీవ్శర్మ మాట్లాడుతూ పవర్ ప్లాంట్లు, నీటి పారుదల ప్రాజెక్టులు ఇంత తొందరగా పూర్తి కావడం తానెక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు తాము అందించిన ఆర్థిక సహకారం నూటికి నూరు పాళ్లు సద్వినియోగం కావడం సంతోషంగా ఉన్నదని అన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జెన్కో, ట్రాన్స్కో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు సేవల్ని ప్రసంసించారు.