Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు చికిత్స
- నెలలో 60వేల మంది ఔట్పేషెంట్లు
- ఆదివాసీ ప్రాంతాల్లో విషజ్వరాల పంజా
- సగటున ఒక్కోఊళ్లో 20మందిపైగా జ్వర పీడితులు
- పీహెచ్సీల నుంచి పెద్దాస్పత్రులకు రిఫరల్ కేసులు
రోగాలతో జనం తల్లడిల్లిపోతుంటే...పాలకులు ఏ మాత్రం పట్టించుకోవటంలేదు. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మలేరియా,టైఫాయిడ్, డెంగీ కేసులతో రోగులు నీరసించిపోతున్నారు. ప్రతి ఏటా వర్షాకాల సీజన్లో ఈ వ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి. కానీ ముందస్తు చర్యలు తీసుకోవటంలేదు. అధికారులూ లైట్ తీసుకోవటంతో..ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రాణాలు తోడేస్తున్నాయి. సర్కారు దవాఖానాల్లో పడకల్లేకపోవటంతో..ఒకే మంచంపై ముగ్గురు పేషెంట్లను పడుకోబెడుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రులైతే రోగులను భయపెట్టి మరీ జేబులు నింపుకుంటున్నాయి.
నవతెలంగాణ-ఆదిలాబాద్రూరల్
ఆదివాసీ గ్రామాలు విషజ్వరాలతో విలవిల్లాడుతున్నాయి. ఒక్కో ఊళ్లో 20 మందికిపైగా జ్వర పీడితులు ఉంటున్నారు. మొన్నటిదాకా కురిసిన వర్షాలు, ముసురుకు తోడు పారిశుధ్యం పడకేయడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. దోమలు వృద్ధి చెందడంతో ఈ రెండువారాల్లోనే మలేరియా, టైఫాయిడ్, ఇతర విషజ్వరాలు పెరిగాయి. స్థానిక పీహెచ్సీలకు వస్తున్న రోగుల్లో సగానికిపైగా రిమ్స్, మంచిర్యాల పెద్దాస్పత్రులకే సిఫారసు చేస్తున్న కేసులుండటం గమనార్హం. దీంతో బెడ్లు సరిపోక రిమ్స్ ఆస్పత్రిలో ఒకే మంచంపై ముగ్గురేసి చొప్పున చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని అటవీ గ్రామాల్లో జ్వరాలతో జనం మంచం పడుతున్నారు. ప్రధానంగా ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, వాంకిడి, నిర్మల్, ఊట్నూర్ వంటి ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కడ చూసినా చలితోకూడిన జ్వరం, దగ్గు, జలుబువంటి రోగాలతో బాధపడుతున్నారు. ఏ అటవీ గ్రామంలో చూసినా 20 నుంచి 30 మంది జ్వరపీడితులే దర్శనమిస్తున్నారు. అందులోనూ వృద్ధులు, చిన్నపిల్లలే ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జ్వరతీవ్రత 103 నుంచి 104 డిగ్రీలు నమోదవుతుండటంతో ఆ కేసులన్నీ రిమ్స్, మంచిర్యాల ఆస్పత్రులకే రెఫర్ అవుతున్నాయి. మరికొన్ని ఏకంగా వరంగల్, హైదరాబాద్ లాంటి ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
నెలలో 50వేలపైగా కేసులు
వర్షాకాలం ప్రారంభం నుంచి రిమ్స్లో రోగుల తాకిడి పెరిగింది. గతంలో రోజుకు 500 వరకు ఇన్పేషెంట్లు ఉండగా.. ప్రస్తుతం 700 వరకు ఇన్పేషెంట్లు వస్తున్నారు. జూన్లో 51వేలా 500 మంది వివిధ రకాల జ్వరపీడితులు వస్తే జులైలో ఏకంగా ఆ సంఖ్య 56వేలా 618కి చేరింది. అందులో విషజ్వర పీడితులు 1832 మంది, టైఫాయిడ్ బాధితులు 390, డెంగ్యూ రోగులు 10 మంది వరకు ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. 15 రోజుల ముందు వరకు ఇంద్రవెల్లి పీహెచ్సీకి రోజుకు సుమారు 120 మంది వస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 200 దాటుతుండటం గమనార్హం. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్న గిరిజన జనమూ ఎక్కువగానే ఉంటున్నారు.
ముసురుకు తోడు పారిశుధ్య లోపం..
భారీ వర్షాలనంతరం వారం పాటు ముసురుతో కూడిన వాన పడటం.. అప్పటికే పారిశుధ్యం పూర్తిగా లోపించడం.. బురద రోడ్లు, రోడ్డుపైపారే మురుగు కారణంగా దోమలు క్రమంగా వృద్ధి చెందాయి. బావులు, బోర్లలో కొత్తనీరు చేరడం కూడా జ్వరపీడితులు పెరగానికి కారణంగా కనిపిస్తోంది. ఫలితంగా ఊరికో 20 నుంచి 30 మంది మంచాన పడుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల గ్రామాలు దొడంద, గట్టెపల్లి, వాల్గొండ, పాటగూడ, ఖైర్గూడ, సిరికొండ మండలం రాజంపేట్, వాయిపేట్, నేరడిగొండ(జి), నారాయణపూర్, జెండాగూడ, రాంపూర్, కొండాపూర్ పంచాయాతీలు, వాటి అనుబంధ తండాల్లోనూ ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది.
స్థానికంగా అందని వైద్యసేవలు
వర్షాలకు వాగులుపొంగి ఆసిఫాబాద్ డివిజన్లోని చాలా ఊళ్లకు రాక పోకలు నిలిచిపోవడంతో అక్కడ పరిస్థితి దయనీయంగా మారింది. జ్వరపీడి తులను కాగజ్నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఆస్పత్రులకు తీసుకొద్దామంటే వాగులు దాటలేని పరిస్థితి ఏర్పడింది. అందుబాటులో ఆస్పత్రులున్నా.. సరిపడా మందుల్లేక, చికిత్స అందించే వైద్యులూ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త మండలాలు ఏర్పడి మూడేండ్లవుతున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కాలేదు. సిరికొండ మండల కేంద్రంలో పీహెచ్సీ లేక ఇక్కడి గిరిజనులు ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండల కేంద్రాలకు వెళ్తున్నారు. వెళ్లలేని వారికి వైద్య సేవలందించేందుకు వైద్యాధికారులూ పత్తాలేరు. మరికొన్ని ఊళ్లకు సరైన రోడ్డు మార్గం లేక మండల కేంద్రాలకూ రాలేకపోతున్నట్టు తెలిసింది. సిరికొండ మండల కేంద్రాలకు రావాలంటే భీంపూర్, రాయపేట, ఫకీర్నాయక్తండా, నేరడిగొండ నారాయణపూర్, జెండాగూడ, కుంటగూడ, బోరింగ్గూడ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆస్పత్రిలో ఒకటే ఉక్కపోత
కొలాం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న నా కొడుకు ఆడె శివరాజ్కు రెండ్రోజుల క్రితం జ్వరం రావడంతో ఉపాధ్యాయులు రిమ్స్లో చేర్పించారు. టైఫాయిడ్ ఉందని వైద్యులు నిర్ధారించారు. ఇక్కడే చికిత్స పొందుతున్నాం. రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉంది. మాటిమాటికీ కరెంటు పోతోంది.
- ఆడె సూర్యభాన్, ముంజిగూడ, జైనూర్
ప్రశాంతంగా నిద్రించలేకపోతున్నాం
కాళ్లు, చేతులకు మొత్తం వాపు రావడంతో రెండ్రోజుల క్రితం రిమ్స్లో జాయిన్ అయ్యాను. వైద్యం బాగానే అందిస్తున్నప్పటికీ రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. ఒక్కోసారి ఒక బెడ్పై ఇద్దరు లేదా ముగ్గురు రోగులను ఉంచడం ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం.
- మడావి సుంగు, తంతోలి, ఆదిలాబాద్