Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీలు అమలు చేయాలన్న పారా ఉపాధ్యాయులపై ఉక్కుపాదం
- అణచివేత చర్యలు మానుకోండి : వామపక్షాల హెచ్చరిక
కోల్కతా : పశ్చిమబెంగాల్ను పోలీసు రాజ్యంగా మారుస్తున్నారని ముఖ్యమంత్రి మమత బెనర్జీపై వామపక్ష నేత, లెఫ్ట్ లెజిస్టేటివ్ పార్టీ నేత డాక్టర్ సుజన్ చక్రవర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సరైన వేతన విధానం, తదితర అంశాలపై టీఎంసీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని పారా ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆందోళనను అణచివేసేందుకు మమత ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మమతకు సుజన్చక్రవర్తి సోమవారం బహిరంగ లేఖ రాశారు. 2009లో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో మీరు ఇచ్చిన హామీల అమలును కోరుతున్న పారా ఉపాధ్యాయులపై నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేకంగా సాగిస్తున్న పాలనా విధానాలను మార్చుకోవాలన్నారు. సరైన వేతన విధానం కోసం ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేసే వారిని అణగదొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆందోళనకారులపై పోలీసులను ప్రయోగించడం సరైన పద్ధతా, ఇక్కడేమైనా ఎమర్జెన్సీ విధించారా అని మమతను నిలదీశారు. 2009లో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సమయంలో మీరు ఇచ్చిన హామీల అమలునే ఉపాధ్యాయలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.