Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నిరసనలు తెలపాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తోందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల హక్కులను కాలరాస్తోందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కనీస వేతనం రోజుకు రూ.178 (నెలకు రూ.4,628)గా ప్రకటించిందని తెలిపారు. ప్రస్తుతం అంతకంటే ఎక్కువ వేతనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పదేండ్లుగా కనీస వేతనాల జీవో ఇవ్వడం లేదని తెలిపారు. 2018 జనవరిలో కనీస వేతనంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీ రూ.375 నుంచి రూ.447కు పెంచాలని సిఫారసు చేసిందని పేర్కొన్నారు. కేంద్రం నియమించిన పే రివిజన్ కమిటీ కనీస వేనం రూ.18 వేలు ఉండాలని ప్రకటించిందని తెలిపారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కనీస వేతనం రూ.178 అని ఏకపక్షంగా ప్రకటించడం కార్మిక వ్యతిరేక విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్మికుల్లో వస్తున్న వ్యతిరేకతను తప్పుదోవ పట్టించేందుకు మరోపక్క కనీస వేతనం రూ.24 వేలు అంటూ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేసే చర్యలను వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 100 రోజుల ప్రణాళికను ప్రకటించిందని తెలిపారు. 46 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం లేదా మూసివేయాలని కేంద్రం నిర్ణయించిందని నిటిఆయోగ్ చైర్మెన్ జూన్ ఒకటిన ప్రకటించారని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, కోల్ఇండియాలో వాటాల ఉపసంహరణ, రైల్వేల ప్రయివేటీకరణ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రయివేటు వారికి అప్పగించడం వంటి చర్యలను ప్రారంభించిందని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో 2014 నుంచి 2019 వరకు రూ.2.79 లక్షల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను ప్రయివేటుకు వారికి అప్పగించిందని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతోందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యమైతే నష్టపోయేది కాంట్రాక్టు కార్మికులేనని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల జీవితాలు తిరిగి బానిస బతుకులుగా మారనున్నాయని తెలిపారు.