Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వాగ్గేయకారులు గోరటి వెంకన్న :
బీసీల కొత్త పాట ఆవిష్కరణ
నవతెలంగాణ- నారాయణగూడ
శ్రమ తత్త్వమే బీసీల తత్వమని ప్రముఖ కవి, గేయ రచయిత, గాయకులు గోరటి వెంకన్న అన్నారు. తెలంగాణ బీసీ రచయితల వేదిక ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో గేయ రచయిత, డాక్టర్ కందికొండ యాదగిరి రచించిన 'బీసీ కులాల కొత్త పాట-2019' బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. మనుధర్మం కులాల్లో చిచ్చు పెట్టిందన్నారు. బ్రాహ్మణిజం, మతోన్మాదాన్ని వ్యతిరేకించి దళిత బహుజనులు అధికారంలోకి రావాలన్నారు. బౌద్ధ తత్త్వమే బహుజన తత్త్వం అని చెప్పారు. అధికారం దిశగా బహుజనులు ఉద్యమించాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. బీసీల్లో కవులు, రచయితలు, కళాకారులు ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. లక్ష ఉపన్యాసాల కంటే ఒక పాట గొప్పదని, పాట త్వరగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందని, పాట కోట్లాది మందిని కదిలిస్తుందని అన్నారు. రచయిత కందికొండ రచించిన బీసీల పాట కోట్లాది మంది బీసీలను చైతన్య పరుస్తుందన్నారు. త్వరలో బీసీ కవులు, కళాకారులు, రచయితలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ రచయితల వేదిక అధ్యక్షులు శేఖర్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు శ్రీనివాస్, శ్యామ్, లింగంగౌడ్, నాగేశ్వర్, మహేశ్యాదవ్, వెంకన్నగౌడ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.