Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యంత్రాంగం
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తున విద్యార్థులు కలెక్టరేట్లను ముట్టడించారు. శాంతియుతంగా ర్యాలీలు తీస్తున్నా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ల ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేసి లోపలికి వెళ్లకుండా అడ్డగించారు. ఈ సందర్భంగా పలు చోట్ల తోపులాట జరిగింది. ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం రైల్వే ప్రాంగణం నుంచి వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. వరంగ ల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ఏకశిలాపార్కు నుంచి శాంతియుతంగా కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జనగామలో సుమారు నా లుగు వేల మందితో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు కలెక్ట రేట్ గేట్లు మూసి విద్యార్థులను లోనికి వెళ్ల కుండా అడ్డుకు న్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
ఖమ్మం నగరంలో విద్యార్థులు రోడ్లు ఊడ్చుకుంటూ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట, వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడ్నుంచి ధర్నా చౌక్కు చేరుకుని ధర్నా నిర్వహించారు. జెడ్పీ హాల్లో గ్రీవెన్స్ డే కార్యక్రమానికి వచ్చిన జేసీ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు.
నల్లగొండ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఎస్ఎఫ్ఐ నాయకులను ఈడ్చి పడేశారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వరకు ర్యాలీ, ధర్నా జరిగింది. కలెక్టర్ బయటకు రాకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు గేట్లు నెట్టుకుంటూ దూసుకెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థి నాయకుల బృందం గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనితారామచంద్రన్కు వినతిపత్రం అందించింది.
మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన అనంతరం నోడల్ అధికారి మధుమోహన్కు వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి మహబూబ్నగర్లోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడులు జరిగాయి.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్ దివ్యదేవరాజన్కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. కామారెడ్డిలో ర్యాలీగా కలెక్టరేట్కు బయల్దేరగా పోలీసులు బస్టాండు వద్దే అడ్డుకొని ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ కలెక్టర్ల వద్ద ధర్నా చేశారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఇన్ చార్జి డీఆర్వో నరసింహమూర్తికి వినతిపత్రం అందించారు. ర్యాలీగా వెళ్లి జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
ప్రభుత్వ వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించి, కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.