Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
- విద్యారంగ సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం
- రాష్ట్ర మంత్రులను తిరగనివ్వం : రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా జరిగింది. ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు
ప్రగతి భవన్ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే ప్రగతి భవన్ వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ప్రగతి భవన్ వద్ద ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పోలీసులు వారిని అడ్డుకొని దొరికిన వారిని దొరికినట్టుగానే ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకవైపు వాగ్వాదం జరుగుతుండగానే ఇంకోవైపు పోలీసు కానిస్టేబుళ్లు ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, ఎండీ జావేద్, ప్రకాశ్కరత్, సహాయ కార్యదర్శి సంతోష్ తదితరులను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లాల కలెక్టరేట్ల ముట్డడి కార్యక్రమం జరిగింది. అంతకుముందు ప్రగతి భవన్ వద్ద మీడియాతో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందిస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదని ఎద్దేవా చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా, పేద విద్యార్థులైన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త గురుకులాలు ప్రారంభించామని చెప్తున్నా సొంత భవనాలు నిర్మించలేదని అన్నారు. కనీస వసతుల్లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు రెండు జతల బట్టలు ఇవ్వకపోవడంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పాత బట్టలే వేసుకొని వచ్చారని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని విద్యార్థులకు దూరం చేసే ప్రమాదకరమైన ధోరణి సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విద్యాభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులను ఐక్యం చేసి మంత్రులను తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి, ప్రశాంత్, అశోక్, శంకర్, రవి, గణేష్, అస్మిత, అఖిల, గంగ, రాజు, జగన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అరెస్టులను ఖండిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరితే విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తారా?అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి తాళ్ల నాగరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించి విద్యార్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అరెస్టు చేసిన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.