Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కేవీపీఎస్ ఆగ్రహం
- ప్రజా సంఘాలు ఖండించాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అణగారిన కులాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విమర్శించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగం కల్పిస్తున్న రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను ప్రజాసంఘాలు ఖండించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిగల్ల భాస్కర్, టి స్కైలాబాబు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఆర్ఎస్ఎస్ జ్ఞానోత్సవ్ కార్యక్రమంలో రిజర్వేషన్లను తొలగించాలంటూ మోహన్ భగవత్ పొరపాటున వ్యాఖ్యానించలేదనీ, రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ అసలు నైజం బయటపెట్టిందని వ్యాఖ్యానించారు.
ఆర్ఎస్ఎస్ ఎజెండాలోనే రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న ఉద్దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. బీజేపీ పాలనలోనే రాజ్యాంగ సమీక్షలు, రిజర్వేషన్ల కోటా రద్దు వంటి అంశాలపై దేశ వ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతుందో విజ్ఞులైన వారికి విధితమవుతుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ లైంగిక నిరోధక చట్టం నిర్వీర్యం చేస్తూ గతంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వటం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను రద్దు చేసి దేశ సమైక్యతకు భంగం కలిగించటం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గోరక్షక దళాల ముసుగులో దళితులపై దాడులు ఆర్ఎస్ఎస్ దాడులు జరుపుతున్నదనీ, దళిత, గిరిజనులకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమనడానికి ఇదే ప్రత్యేక నిదర్శనమన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీ, మహిళలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నదని తెలిపారు. దీన్ని దళిత, గిరిజన, బలహీనవర్గాల సంఘాలు, సంస్థలు ముక్త కంఠంతో ఖండించాలన్నారు.