Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేసింది. ఈ మేరకు జాక్టో చైర్మెన్ జి సదానందంగౌడ్, సెక్రెటరీ జనరల్ ఈ రఘునందన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఏడాది దాటినా సీఎం హామీలు నీటిమూటలుగానే మిగిలాయని తెలిపారు. ఐఆర్ ప్రకటించాలని, పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్, జీహెచ్ఎం, ఎంఈవో, డిప్యూటీఈవో, డైట్, బీఈడీ లెక్చరర్ల పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్నారు. అంతర్జిల్లా బదిలీలు చేయాలని తెలిపారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. లేనిపక్షంలో వచ్చేనెల ఒకటిన హైదరాబాద్లో ఉపాధ్యాయ గర్జన నిర్వహిస్తామని తెలిపారు.