Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ వీకే జిందాల్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రతినిధి
భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసిపట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ వీకే జిందాల్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జలశక్తి అభియాన్ పథకం, జిల్లాలో జులై నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిందాల్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి వర్షపు చుక్కనూ కాపాడుకునే దిశగా అడుగులు వేయాలన్నారు. సెప్టెంబర్ చివరి వరకు జలశక్తి అభియాన్ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. చేసిన పనిని ఎప్పటికప్పుడూ ఫొటో తీసి సంబంధిత వివరాలను అప్డేట్ చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లు, కళాశాల్లో నీటి ఆవశ్యకతను తెలియజేసే విధంగా క్విజ్ పోటీలు, పెయింటింగ్, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం, భూగర్భ జలాలు పైకిరావడానికి తీసుకోవాల్సిన చర్యలు, వృథా నీటిని తిరిగి ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఇంటింటికీ ఇంకుడు గుంతలు, బోర్ల రీచార్జ్, చెరువులు, బావుల్లో పూడికతీత, కందకాలు తవ్వడం, చెక్డ్యాంలు నిర్మించడం, మొక్కులు నాటడం వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భూగర్భ జల వనరులను కాపాడేందుకు ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురావాలన్నారు. భవిష్యత్లో నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. చెన్నైలో ఎదుర్కొంటున్న నీటి పరిస్థితులను గుర్తు చేశారు. దేశంలో జలవనరుల కొరతను తీర్చడంతో పాటు నీటి వనరులు పెంచుకోవడానికిి కేంద్ర ప్రభుత్వం జల్శక్తి అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఏడీ ప్రశాంత్కుమార్, డీపీఓ పద్మజారాణి, హార్టికల్చర్ అధికారి సునంద, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.