Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేనేత, జౌళిశాఖ అధికారులతో కేటీఆర్ సమీక్ష
నవతెలంగాణ-సిరిసిల్ల
ప్రభుత్వం తరపున అందజేస్తున్న బతుకమ్మ చీరలు చాలా బాగున్నాయనీ, వాటికి ఒక బ్రాండింగ్ ఏర్పడేలా చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారకరామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం చేనేత, జౌళి శాఖ అధికారులతో వర్కర్ టు ఎంటర్ప్రెన్యూర్, అపెరెల్ పార్కు, టెక్స్టైల్ పార్కు అదనపు పనుల పురోగతి బతుకమ్మ చీరల తయారీపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ సంచలకురాలు శైలజారామయ్యర్ బతుకమ్మ చీరల ప్రగతిని వివరించారు. పేద కుటుంబాల్లోని మహిళలకు బతకుమ్మ పండుగ సందర్భంగా కోటి బతుకమ్మ చీరలను అందివ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూ.320 కోట్ల విలువైన చీరల తయారీ ఆర్డర్లను ఇచ్చిందన్నారు. జిల్లాలోని 23,614 పవర్లూంలు, 122 మ్యాక్, 163ఎస్ఎస్ఐల ఆధ్వర్యంలో చీరల ఉత్పత్తి జరుగుతోందన్నారు. మొత్తం 6.84 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేయాల్సి ఉండగా 4.27 కోట్ల మీటర్ల ఉత్పత్తి ఇప్పటివరకు పూర్తి అయ్యిందన్నారు. సకాలంలో ఉత్పత్తి పూర్తి చేసి పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా చేనేత, జౌళిశాఖ అధికారులు తయారు చేసిన చీరలను కేటీఆర్కు చూపించారు. గతం కంటే చీరలు చాలా అందంగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రత్యేక లోగోను రూపొందించి ఒక బ్రాండ్ ఏర్పడేలా కృషిచేయాలని చెప్పారు. హైదరాబాద్ నుంచి మహిళా జర్నలిస్ట్లను సిరిసిల్లకు పిలిపించి బతుకమ్మ చీరల ప్రత్యేకతను వివరించాలని సూచించారు.