Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఉపసంహరించుకోవాలి
- రెండో రోజు ఓడీఎఫ్ ఉద్యోగుల సమ్మె
నవతెలంగాణ- కంది/సంగారెడ్డిటౌన్
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశభక్తి ముసుగులో దేశ సంపదనను అమ్ముకుంటోందని ఏఐడీఈఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోపాల్రావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్రావు, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దులమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల వద్ద ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని వారు సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. రక్షణ రంగంలో కీలపాత్ర పోషిస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరణ చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓడీఎఫ్ కార్మికుల పోరాటం దేశభక్తి గలిగిన పోరాటమన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దేశ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఇన్సూరెన్స్ రిటైల్ రంగంలో ఎఫ్డీఐలను ఆహ్వానించారన్నారు. ఇప్పుడు రక్షణ రంగ సంస్థల వంతు వచ్చిందన్నారు. రక్షణ రంగ సంస్థలను రక్షించుకోవడమంటే.. దేశాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరి శివకుమార్, సహాయ కార్యదర్శి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
రక్షణ రంగాన్ని కాపాడుకుందాం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
దేశంలో రక్షణ రంగాన్ని కాపాడుకొని దేశాన్ని రక్షించుకుందామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓడీఎఫ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రయివేటీకరించాలన్న ప్రధాని మోడీ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ దేశభక్తి అంటూ.. దేశానికి రక్షణగా ఉన్న రక్షణ రంగాన్ని ప్రయివేటుపరం చేయడం సిగ్గుచేటన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలిపిందన్నారు. ఈ సమ్మెతో మోడీ సర్కార్ కండ్లు తెరవాలన్నారు. దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని, దేశం కోసం ఎంతో చేస్తున్నామని చెబుతున్న మోడీ సర్కార్.. దేశానికి రక్షణగా ఉన్న ఆర్డినెన్స్ పరిశ్రమలను ఎందుకు ప్రయివేటుపరం చేయాలని ఆలోచిస్తోందని ప్రశ్నించారు. అంతకుముందు ఓడీఎఫ్ కార్మికుల సమ్మెకు సంఘీ భావంగా చేపట్టిన ర్యాలీని ఐబీ నుంచి న్యూ బస్ స్టాండ్ వరకు నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, నాయకులు జి.సాయిలు, ఎం.యాదగిరి, పి.పాండురంగారెడ్డి, సీబీఎల్ పరిశ్రమ యూనియన్ నాయకులు ప్రస న్న, సురేష్, మహేశ్, యూబీ జన్నెబాబు, వివిధ పరిశ్రమల యూనియన్ల నేతలు పాల్గొన్నారు.