Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రాష్ట్రాల్లో మూడో స్థానంలో తెలంగాణ
- తప్పుడు రోగనిర్ధారణలతో రోగులకు అందని సరైన వైద్యం
- ఇండియన్ హార్ట్ హార్ట్ స్టడీలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో బీపీ రోగుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బీపీతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతున్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా బీపీ వచ్చే వయస్సు సరాసరిగా 42 సంవత్సరాలుగా ఉండగా, రాష్ట్రంలో మాత్రం 38 సంవత్సరాలుగా తేలింది. తప్పుడు రోగ నిర్ధారణ పరీక్షల కారణంగా బీపీ ఉన్న వారికి లేనట్టు, లేని వారికి ఉన్నట్టు ఫలితాలు వస్తున్నాయి. దీంతో బీపీ ఉన్న వారు దానికి సరైన వైద్యం తీసుకోలేకపోతుండగా, లేనివారు తమకు బీపీ ఉన్నట్టు ఔషధాలు వాడుతున్నట్టు ఇండియన్ హార్ట్ స్టడీలో తేలింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 9 నెలల కాలంపాటు 1233 మంది వైద్యులు 18,918 మంది మహిళలు, పురుషులపై అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బుధవారం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఇరీస్ లైఫ్ సైన్సెస్ (మెడికల్) అధ్యక్షులు డాక్టర్ విరాజ్ సువర్ణ, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీషా సహారు, అపొలొ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్ కపూర్, కార్డియోవాస్క్యులర్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ మాస్ట్రిచ్ (సీఏఆర్ఐఎం) డాక్టర్ విల్లెం వెర్బెక్ అధ్యయనం వివరాలను వెల్లడించారు.
ఫలితాల్లో తారుమారు ఎలా?
అధ్యయనంలో పాల్గొన్న 36 శాతం మందికి వైద్యుల వద్ద అధిక రక్తపోటు ఉన్నట్టుగా వెల్లడైంది. వారికి తిరిగి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహించగా అధిక రక్తపోటు లేనట్టు తేలింది. ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో వైట్ కోట్ హైపర్ టెన్షన్ గా వ్యవహరిస్తారు. 14.30 శాతం మందికి దీనికి పూర్తి భిన్నంగా పరిస్థితి ఉన్నట్టు ఫలితాలు చెబుతున్నాయి. వైద్యుల వద్ద పరీక్షల్లో ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిన వీరికి తిరిగి ఇంటి వద్ద పరీక్షలు చేయగా హైపర్ టెన్షన్ ఉన్నట్టు ఫలితాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితిని మాస్క్ డ్ హైపర్ టెన్షన్ గా పిలుస్తారు. అలా కాకుండా వైద్యుని వద్ద, ఇంటి వద్ద కూడా హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలిన వారి సంఖ్య 28 శాతం ఉన్నట్టు ఫలితాల్లో వెలుగు చూసింది.
నష్టపోతున్న ప్రజలు
వైద్యుని వద్ద నిర్వహించిన పరీక్షల్లో హైపర్ టెన్షన్ బయటపడని (మాస్క్ డ్ హైపర్ టెన్షన్) రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తగిన జాగ్రత్తలు, ఔషధాలు తీసుకోని కారణంగా గుండె, మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నట్టు పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి. అదే విధంగా వైద్యుని వద్ద నిర్వహించిన పరీక్షల్లో మాత్రమే హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలిన రోగులు (వైట్ కోట్ హైపర్ టెన్షన్) సైతం అవసరానికి మించి ఔషధాలు తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్టు తమ అధ్యయనంలో గమనించినట్టు వైద్యులు తెలిపారు.
ఎందుకిలా?
మారిన జీవనశైలి, నిద్రలేమి, మత్తుపదార్థలను సేవించడం, శారీరక వ్యాయమం లేకపోవడం తదితర కారణాలతో రోగుల సంఖ్య పెరుగుతుందని అధ్యయనకారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.