Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
- పచ్చదనం, పరిశుభ్రతపై 60 రోజుల ప్లాన్
- అమలుకు నిర్దిష్ట కార్యాచరణ
- గజ్వేల్ నియోజకవర్గంలో కలెక్టర్లతో కలిసి పర్యటన
- కోమటిబండలోని మిషన్ భగీరథ ప్లాంటు సందర్శన
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో, గజ్వేల్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. సామాజిక అడవుల పెంపకమనేది ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్ర తలను తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకమనేది మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని తెలిపారు. వర్షాలు బాగా కురవడానికి, జీవ వైవిధ్యానికి ఇది దోహద పడుతుందని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో కలెక్టర్లతో కలిసి సీఎం పర్యటించారు. అక్కడ చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను వారికి స్వయంగా వివరించారు. తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలోని అటవీ భూములు చెట్లులేని ఎడారుల్లా మారాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్టు వివరించారు. మూడేండ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు. 27 రకాల పండ్ల మొక్కలను కూడా ఈ అడవుల్లో పెంచడం వల్ల అవి మంకీ ఫుడ్ కోర్టుల లాగా తయారవుతున్నాయని తెలిపారు. గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందనీ, ఇది మన భూభాగంలో 23.4శాతమనీ చెప్పారు. ఇంత పెద్ద విస్తీర్ణంలో అటవీ భూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవని చెప్పారు.
గజ్వేల్ అటవీ ప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఆ శాఖ పీసీసీఎఫ్ ఆర్. శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ను వినియోగించుకుని అక్కడ సహజ పద్ధతుల్లో చెట్ల పెంపకాన్ని చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీయటం వల్ల అక్కడి చెట్లకు రక్షణ ఏర్ప డుతుందని వివరించారు. బయటి జంతువులు లోప లకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందు తుందని చెప్పారు. కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడం వల్ల అడవికి సహజమైన రక్షణ ఏర్ప డుతుందని వివరించారు. 27 రకాల పండ్ల చెట్లను కూడా అడవుల్లో పెంచుతున్నామని, దీనివల్ల గ్రామా లు, పట్టణాల్లోని కోతులు అడవికి వాపస్ పోతు న్నాయని అటవీశాఖ అధికారులు ఈ సందర్భంగా చెప్పారు. అడవుల పునరుద్ధరణ వల్ల కాలుష్యంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని తెలిపారు. వర్షపాతం పెరగటం వల్ల జీవ వైవిధ్యానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. జిల్లాల్లో అడవుల పునరు ద్ధరణకు అవసరమయ్యే కాంపా నిధులు అందు బాటులో ఉన్నాయని తెలిపారు. తద్వారా చెట్ల పెంప కానికి అవసరమైన చర్యలు అటవీశాఖ ద్వారా తీసు కుంటామని వారు చెప్పారు.
అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వారితో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలుపైనా, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైనా సీఎం చర్చించారు.
పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈసందర్భంగా చెప్పారు. ఇందుకు అనుగు ణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. అవినీతికి ఆస్కారం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని సీఎం వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి సుభాష్రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.