Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తవ్వకాలపై రాష్ట్రం వైఖరిని చెప్పాలి : మాజీ ఎంపీ మిడియం బాబూరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం సర్వే పనులను వెంటనే ఆపేయాలని మాజీ ఎంపీ, ఎఎఆర్ఎం చైర్మెన్ మిడియం బాబూరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలు, కంపెనీ ఏర్పాటు వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గ్రామసభలు పెట్టకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా యురేనియం తవ్వకాలకు సంబంధించిన పనులు మొదలు పెట్టడం దారుణమన్నారు. యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం గమ్ముగా ఉండటం సరిగాదని, తన వైఖరిని స్పష్టంగా చెప్పాలని డిమాం డ్ చేశారు. మల్లాపూర్లో యురేనియం ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయని, ఆ గ్రామం నాగార్జున సాగర్ బ్యాక్వాటర్కు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉండటంతో జలకాలుష్యమై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాప్రాంతంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, అక్కడ జీవవైవిధ్యం పూర్తిగా దెబ్బతింటుందని వివరించారు. చెంచుల జనాభా పూర్తిగా అంతరించి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమ్రాబాద్ రిజర్వు ఫారెస్టులో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా వేల బోర్లను 350 నుంచి 400అడుగుల మేర ఏవిధంగా వేస్తారని ప్రశ్నించారు. యురేని యం ప్రాజెక్టు వల్ల తెలంగాణ భౌగోళిక స్వరూపం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో యురేని యం ప్రాజెక్టు సర్వే పనులను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు.
యురేనియం అనార్ధాల గురించి విడమర్చి చెప్పేందుకు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బాధిత గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తామన్నారు. గ్రామసభల తీర్మానాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. నల్లమలలో జీవివైవిధ్యాన్ని కాపాడేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని, చిట్టడవులు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ధర్మానాయక్, అధ్యక్షులు డి.రవినాయక్, రాష్ట్ర కార్యదర్శి టి.భీంరావ్, రాష్ట్ర నాయకులు కె.భరత్, ఎం.బాలు, టీఏవీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, తదితరులు పాల్గొన్నారు.