Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు మేలు కాదు.. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి
- మోడీ సర్కారుకు మద్దతుపై కేసీఆర్ వివరణ ఇవ్వాలి : మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో మాంద్య పరిస్థితుల్లోనూ యథేచ్ఛగా ఆర్థిక దోపిడీ జరుగుతున్నదని, కార్పొరేట్లకు మాంద్యం కూడా లాభాలను తెచ్చిపెడుతున్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. మాంద్య సమయంలో ప్రజల కొనుగోలు స్థాయి పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిన పాలకులు కార్పొరేట్లకు రుణాలు ఇవ్వడం, మొండి బకాయిలను రద్దుచేయడం, సబ్సిడీలు ఇవ్వడం, వడ్డీ రేట్లు తగ్గించడం ఆందోళన కరమన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఆర్థిక మందగమనం-పారిశ్రామిక రంగం-కార్మికులపై ప్రభావం' అంశంపై సెమినార్ మంగళవారం జరిగింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో నాగేశ్వర్ మాట్లాడుతూ...కార్పొరేట్లకు చెందిన ఐదున్నర లక్షల కోట్ల రూపాయల మొండిబకాయిలను కేంద్రం మాఫీ చేసిందని, అదే సందర్భంలో రైతులకు మాఫీ చేసింది కేవలం 72 వేల కోట్ల రూపాయలేనని వివరించారు. ఓటాన్ బడ్జెట్కు, ప్రస్తుత బడ్జెట్ను చూస్తే రాష్ట్ర ఆదాయం రూ.36 వేల కోట్లకు పడిపోయిందని, దీనికి తన బాధ్యతేమీ లేదు...ఆర్థిక మాంద్యం కేంద్రం బాధ్యత అని తప్పుకోవాలని సీఎం చూసాడని మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ విమర్శించారు. కేంద్ర మీద నెట్టేసే ముందు కేసీఆర్ ఆరేండ్లుగా మోడీ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాల్సిన ప్రతి సందర్భంలోనూ ఎందుకు గుడ్డిగా మద్దతు తెలిపారని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక విధానాలే నేటి మాంద్యానికి కారణమని చెప్పే కేసీఆర్...నోట్లరద్దు, జీఎస్టీ, ఇలా ప్రతి ఆర్థిక విధానాల విషయంలో కీలక సమయాల్లో మద్దతు తెలపటంపై ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం తన ప్రసంగంలో మాంద్యం ప్రభావం తీవ్రంగా పడిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలన్నీ పడిపోయిన నేపథ్యంలో కొత్త పథకాలు మొదలుపెట్టలేమని చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితే ఇంత ఘోరంగా ఉంటే ప్రజల ఆదాయాలు ఎంత ఘోరంగా పడిపోయాయేనన్న ఆలోచన, ఆందోళన ప్రభుత్వానికి రాలేదా? అని ప్రశ్నించారు. మార్కెట్లో తగ్గడం వల్లే వాణిజ్య పన్నులు, మోటారు ట్యాక్స్, ఎక్సైజ్ ఆదాయాలు పడిపోయాయని ఉదాహరణలతో వివరించారు. అయితే, సామాన్యులు వాడే పరికరాలు, బైకులు, బిస్కట్లు, సబ్బు లు, తదితర వస్తువుల కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయని, అదే సందర్భంలో సంపన్నులు వాడే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, విలాస వస్తువుల కొనుగోళ్లు తగ్గలేదని, ఈ అంశాలు దేశంలోని ఆర్థిక అసమానతలను ఎత్తిచూపుతున్నాయన్నారు. ప్రజల ఆదాయాలు తగ్గిపోయాక కొనుగోళ్లు ఎలా జరుగుతాయి? ఉపాధి ఎలా పెరుగుతుంది? ప్రభుత్వ ఆదాయాలు ఎలా పెరుగుతాయి? అని ప్రశ్నించారు. పెట్టుబడి సంపదను సృష్టించదని, దానికి శ్రమశక్తి తోడై మార్కెట్లో చలామణి అయితేనే ఆదాయం పెరుగుతుంద న్నారు. దీనిని మరిచి మోడీ పెట్టుబడిదారులు మాత్రమే సంప దను సృష్టిస్తున్నారని చెప్పడం, కార్మికుల, కర్షకుల పాత్రను తక్కు వ చేసి చూపటం దారుణన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధా నాలపై కార్మికులను చైతన్య పరిచే పాత్ర మరింత మెరుగు కావా లన్నారు. సీఐటీయూ ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్ మాట్లా డుతూ..రానున్న రోజుల్లో ఆర్థిక మాంద్యం మరింత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. పరిశ్రమలు ఉత్పత్తులు తగ్గించ డం, హాలిడేలు ప్రకటించడం, కార్మికుల తొలగించడం దారుణ మని అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయి బాబు మాట్లాడుతూ... ఒకటి కొంటే రెండు ఉచితం అనేది ఆర్థిక మాంద్యానికి సూచికమన్నారు. సంపద కేంద్రీకమవ్వడం, ఆర్థిక అసమానతలు కూడా మాంద్యానికి దారితీస్తాయన్నారు. మాంద్యం పేరుతో పరిశ్రమలు కార్మికులను అకారణంగా తొలగిం చడం దారుణమన్నారు. లాభాలు పెరిగినప్పుడుగానీ, ఉత్పత్తి ఎక్కువ చేయించుకున్నప్పుడుగానీ కార్మికులకు ఏమైనా ఎక్కువ జీతాలు ఇచ్చారా? లాభాలు రావడంలేదని, వస్తువులు అమ్ముడు పోవడం లేదని కార్మికులను ఇప్పుడు తొలగించడం ఎంత వరకు సబబు? అని నిలదీశారు. కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లను ఏ పరిశ్రమ కూడా పట్టించుకోవడం లేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, పాలడుగు భాస్కర్ పాల్గొన్నారు.