Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిస్కంలకు ఆర్థికమాంద్యం షాక్
- జీతాలు చెల్లించలేని దుస్థితి
- అంతర్గత సర్దుబాట్లు చేసుకోమన్న మధ్యప్రదేశ్ డిస్కం
- తెలంగాణ పరిస్థితీ అదే
- దెబ్బతీస్తున్న ఎల్సీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్థికమాంద్యం దెబ్బకు దేశవ్యాప్తంగా విద్యుత్రంగం విలవిల్లా డుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రప్రభుత్వ విధానపర నిర్ణయాలు ఈ రంగాన్ని మరింత కుదేలు చేస్తున్నాయి. విద్యుత్ సంస్థల్లో ఆర్ధిక క్రమశిక్షణ పేరుతో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ)ను ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఓవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. దీన్నే కేంద్ర ప్రభుత్వం తన ఆదాయవనరుగా మార్చుకోవాలని నిర్ణయించింది. గతంలో పవర్ ఎక్సేంజ్ల నుంచి 30 నుంచి 45 రోజుల గడువుతో ఆయా రాష్ట్రాల డిస్కంలు విద్యుత్ను కొనుగోలు చేసేవి. సహజంగా గృహవినియోగదారులు మొదలు భారీ పరిశ్రమల వరకు ముందు కరెంటును వినియోగించుకొని, నెలరోజుల తర్వాత మీటర్ రీడింగ్ను చూసి బిల్లులు ఇచ్చేవి. ఆ బిల్లుల్ని చెల్లించడానికి ఏడు రోజుల నుంచి 14 రోజుల వరకు గడువు ఇచ్చేవారు. దానివల్లే ఎక్సేంజ్ల నుంచి కూడా 45 రోజుల గడువుతో కొనుగోళ్లు జరిపేవారు. ఈ విధానానికి కేంద్రప్రభుత్వం ఇప్పుడు మంగళంపాడింది.
ఆయా రాష్ట్రాల డిస్కంలు తమకు ఎంత కరెంటు కావాలో ముందే అంచనా వేసి, దానికి అవసరమైన సొమ్మును అడ్వాన్సుగా ముందే చెల్లించాలని షరతు విధించి, ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే దేశవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్ధికమాంద్యం, కేంద్రప్రభుత్వం తీసుకున్న ఎల్సీ విధానపర నిర్ణయం వల్ల డిస్కంలు ఆర్ధికంగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎల్సీ నిబంధన వల్ల ప్రభుత్వపరంగా ఆర్ధికమాంద్యం నుంచి కొంతలో కొంత బయటపడొచ్చనే కేంద్రం ఆలోచన ఇప్పుడు అసలుకే ఎసరు తెస్తున్నది. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు తెలంగాణ విద్యుత్ సంస్థలు పవర్ ఎక్సేంజ్లు, ఇతర కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి కరెంటు కొనుగోళ్ల కోసం దాదాపు రూ.1,200 కోట్లను ముందస్తుగా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పటికే దాదాపు 10వేల కోట్ల అప్పుల్లో ఉన్న డిస్కంలకు ముందస్తు చెల్లింపులు మరింత ఆర్ధిక భారాన్ని మోపాయి. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఒక్క నెలకోసం మాత్రమే తాము రుణంగా డిస్కంలకు నగదు ఇస్తామని, ఆ తర్వాతి నుంచి డిస్కంలే ముందస్తు కొనుగోళ్లు, చెల్లింపులు చేసుకోవాలని తేల్చిచెప్పింది. దీంతో తాత్కాలికంగా ఊరట లభించినా. సెప్టెంబర్ 1 నుంచి డిస్కంలు ఈ ముందస్తు చెల్లింపుల కోసం కొత్తగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. షరతులతో కూడిన వాయిదాల పద్ధతిలో వివిధ ప్రయివేటు బ్యాంకుల నుంచి దాదాపు రూ.3వేల కోట్లను అప్పుగా తీసుకోవాలని నిర్ణయించాయి. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డిస్కంలకు 10వేల కోట్లు రావల్సి ఉంది. అదికాకుండా డిస్కంలు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు దాదాపు రూ.23 వేల కోట్ల వరకు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ప్రకటించిన 'ఉదరు' స్కీంలో చేరేనాటికి తెలంగాణ డిస్కంల అప్పుల్లో రూ.9,695 కోట్లను రాష్ట్రప్రభుత్వం బదలాయించుకుంది. ఉదరు షరతుల్లో భాగంగానే ఇప్పుడు ఎల్సీ నిబంధనను అమల్లోకి తెచ్చారు.
మధ్యప్రదేశ్లో...
మధ్యప్రదేశ్లోని మధ్యక్షేత్ర విద్యుత్ వితరణ్ కంపెనీ లిమిటెడ్ (డిస్కం) ఎల్సీ దెబ్బకు విలవిల్లాడిపోయింది. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేమని తేల్చిచెప్పింది. ఉద్యోగుల ఆగస్టు నెల వేతనాలకు రూ.72.62 కోట్లు అవసరం కాగా రూ.50 కోట్లు మాత్రమే చెల్లించగలుగుతామని, మిగిలిన రూ.22.62 కోట్లను అంతర్గత ఆదాయ వనరుల ద్వారా సమకూర్చుకోవాలని సర్క్యులర్ (చీశీ.వీణ/వీఖ/05/520, ణa్వ 30/08/2019) జారీ చేసింది. పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ)కు ముందుస్తు చెల్లింపులే ఈ దుస్థితికి కారణమని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వరంగ సంస్థల నుంచి డిస్కంలకు 2019 మార్చి 31 నాటికి రూ.8,411.58 కోట్ల బకాయిలు ఉన్నాయి. దాదాపు ఇవన్నీ పారుబకాయిలుగానే ఉండిపోయాయి.
తెలంగాణదీ అదే దారి!
తెలంగాణ డిస్కంల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2019 జూన్ నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి డిస్కంలకు రూ.9,181.81 బకాయిలు ఉన్నాయి. వీటిని సెటిల్ చేయడంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. పైపెచ్చు ఎల్సీ కోసం చేస్తున్న ఆర్ధిక సహాయాన్ని అప్పుగానే పరిగణిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బకాయిలు వసూలైతే ప్రభుత్వ ఆర్ధిక సహకారం అవసరం లేదని టీఎస్ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉదరు' స్కీం తర్వాత కూడా డిస్కంల పనితీరులో ఎలాంటి మార్పు లేదు. ఆయా కంపెనీల్లో రాష్ట్రప్రభుత్వాల జోక్యమే ప్రధాన కారణమని విద్యుత్రంగ నిపుణులు తెలిపారు.
ఎల్సీపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి..
ఎల్సీపై ప్రజాక్షేత్రంలో పూర్తిస్థాయి చర్చ జరగాలి. అలా జరక్కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ఎత్తుగడలకు పాల్పడుతు న్నాయి. దేశంలోని 20 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉంది. ఇవన్నీ ప్రయివేటురంగంలో ఉన్నవే. ఆయా ప్రయివేటు సంస్థలకు మినిమమ్ గ్యారెంటీ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకే కేంద్రప్రభుత్వం ఎల్సీ నిబంధన తెచ్చింది. దీనిపై జాతీయ స్థాయిలో భవిష్యత్ కార్యాచరణను త్వరలో నిర్ణయిస్తాం.
- ఏఐపీఈటీ జాతీయ అధ్యక్షులు శైలేంద్రదూబే
గుదిబండగా ఎల్సీ నిబంధన..
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) నిబం ధన విద్యుత్ సంస్థలకు గుదిబండగా మారింది. రెండు నెలల క్రితం ఢిల్లీలో ఆయా రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో కేంద్రప్రభుత్వం భేటీ నిర్ణయించింది. 20కిపైగా రాష్ట్రాలు ఈ నిబంధనను వ్యతిరే కించాయి. ఆ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షం గా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం డిమాండ్ను బట్టి కేంద్ర విద్యుత్ సంస్థలు, పవర్ ఎక్సేంజ్లకు వారానికి రూ.250 కోట్ల వరకు ముందస్తు చెల్లింపులు చేయాల్సి వస్తున్నది.
- టీఎస్జెన్కో, ట్రాన్స్కో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు