Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2004లో క్వింటా పసుపు రూ.18 వేలు.. నేడు రూ.5 వేలే
- కనిష్టంగా రూ.3500లకు దిగజారిన వైనం
- రోజురోజుకూ నేలచూపులు చూస్తున్న ధరలు
- పెట్టుబడులు పెరిగిపోయి రైతులకు తీవ్ర నష్టం
- నిజామాబాద్, మహారాష్ట్ర మార్కెట్లోనూ ఇదే పరిస్థితి
నవతెలంగాణ-జనగామ ప్రతినిధి
పదిహేనేండ్ల క్రితమే 18 వేల రూపాయలు పలికిన క్వింటా పసుపు నేడు నేలచూపులు చూస్తున్నది. ఆరుగాలం శ్రమించినా సర్కారు నుంచి 'మద్దతు' లేక.. మార్కెట్లో సరైన ధర రాక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోజురోజుకూ ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా చేతికందడం లేదు. సంప్రదాయ పంటగా భావించే పసుపును కనిష్టంగా 3500 రూపాయలకు విక్రయించుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఫలితంగా కష్టానికి కూలి కూడా పడక రైతులకు అప్పులే మిగులు తున్నాయి. వాణిజ్య పంటల్లో పసుపు పంట కీలకంకావడంతో తెలంగాణలోని నిజామాబాద్, వరంగల్ ప్రాంత రైతులు కష్టనష్టాలకోర్చి సాగు చేస్తున్నారు. కానీ ప్రతియేటా
పెట్టుబడి పెరిగిపోతుండగా పసుపు ధర మాత్రం పడిపోతూ వస్తున్నది. 2004లో పసుపునకు గిరాకీ బాగా పెరగడంతో క్వింటాకు రూ.18వేలకు విక్రయించారు. ఎన్నో ఆశలతో వరంగల్ జిల్లాలోనూ గతేడాది 9వేల ఎకరాల్లో సాగుచేయగా.. ఈసారి 15 వేల ఎకరాలకు రైతులు పెంచారు. ఉమ్మడి జిల్లాలోని కేసముద్రం, మరిపెడ, నెల్లికుదురు, తొర్రూర్, నర్సింహులపేట, దుగ్గొండి, నర్సంపేట, పరకాల, ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, ఇనుగుర్తి ప్రాంతాల్లో పసుపు ఎక్కువగా సాగవుతుంది. ఎకరా సాగుచేస్తే దిగుబడి లక్ష రూపాయల మేర వస్తున్నా రైతు కష్టం, కూలీల ఖర్చు మీద పడుతున్న పరిస్థితి. పసుపు 100శాతం దిగుబడిలో 10శాతం కొనుగోలు వరంగల్ ఎనుమాముల మార్కెట్లో, 90శాతం కొనుగోళ్లు కేసముద్రం మార్కెట్లో జరుగుతున్నాయి.
ఎకరాకు రూ.70వేలకుపైగా పెట్టుబడి
గతంలో గోల, కాడి పసుపు దిగుబడి చేసేవారు. ఇప్పుడు ఎసిసి-78, తాండూరు, గిరిరాల పసుపును దిగుబడి చేస్తున్నారు. ఎకరాకు రూ.70వేల పెట్టుబడి పెడుతున్నారు. ఒక్క ఎకరంలో 6 క్వింటాళ్ల పసుపు విత్తుతుండగా 30వేల రూపాయల ఖర్చు వస్తుంది. దున్నకం, విత్తనం నాటే కూళ్లు 8వేలు అవుతుంది. దుక్కిమందు, రెండుసార్లు గుంటక తోలడానికి 10వేల ఖర్చవుతుంది. పురుగుమందు, పంట తీయడం, నాగళ్ల ఖర్చు, ఉడకబెట్టడం ఇలా వీటి ఖర్చు కూడా కలిపితే ఎకరాకు 70వేల వరకు అవుతుంది. తెగుళ్లు సోకకుండా మంచి దిగుబడి వస్తే ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లు చేతికందుతుంది. సగటున క్వింటా ధర 5వేలు ఉన్నందున 15 క్వింటాళ్లకు 75వేలు మాత్రమే వస్తుంది. రైతు పెట్టుబడిపోతే ఐదు వేల రూపాయలు మాత్రమే మిగులుతుంది.
తొమ్మిది మాసాల పంట కావడంతో రైతు కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నది. ఇక తెగుళ్ల లాంటివి సోకితే ఆమాత్రం దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేక నష్టపోవాల్సిందే. ప్రస్తుతం నిజామాబాద్, మహారాష్ట్ర మార్కెట్లోనూ కాస్త అటుఇటుగా వరంగల్ మార్కెట్లో మాదిరిగానే ధరలు పలుకుతున్నాయి.
3 నుంచి ఎకరానికి పడిపోయా..
నాకు ఆరెకరాల భూమి ఉంది. ప్రతియేటా మూడెకరాల్లో పసుపు వేస్తే ప్రస్తుతం ఎకరంలోనే సాగుచేస్తున్నా. 2004 -05లో రూ.18వేలకు విక్రయించగా ఇప్పుడు రూ.5 వేలకు మాత్రమే అమ్ముకోవాలి. అప్పటితో పోల్చితే పెట్టు బడులు కూడా భారీగా పెరిగాయి. పసుపు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదు. పెట్టుబడికి అనుగుణంగా ధర నిర్ణయించి కొనుగోలు చేయాలి.
- వేముల వెంకటేశ్వర్లు, ఉప్పరపల్లి
ఆన్లైన్లోనే కొనుగోళ్లు..
పసుపు కొనుగోళ్లు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. మద్దతు ధర లేకపోవడం వల్ల ఆన్లైన్ ధరల ప్రకారం రైతులు విక్రయిస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందు ల్లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయి. మద్దతు ధర ఉంటే అమలు చేసేందుకు మార్కెట్ నుంచి కృషి చేసేవాళ్లం.
- గందమాల రాజేందర్,
కేసముద్రం మార్కెట్ సూపర్వైజర్
మా గోస తగిలే కవిత ఓడిపోయింది
పన్నెండెకరాల భూమి ఉండగా కేవలం రెండెకరాల్లోనే పసుపు వేశాను. గతంతో పోల్చితే ధరలు భారీగా తగ్గాయి. ప్రభుత్వాలు పసుపు, ఎర్రజొన్న రైతుల్ని పట్టించుకోవడం లేదు. మా గోస తగిలే కేసీఆర్ కూతురు ఓడిపోయింది. ఇంట్లో అందరం పనిచేసినా పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నాం. కనీసం రూ.12 వేలు క్వింటాకు ఇచ్చేలా నిర్ణయించాలి.
గత నాలుగేండ్లలో కేసముద్రం మార్కెట్లో కొనుగోళ్లు..
సంవత్సరం మార్కెట్కు పంట ధర (క్వింటాకు)
(క్వింటాళ్లలో) గరిష్టం కనిష్టం
2016-17 50,823 8,603 4700
2017-18 61961 5010 4000
2018-19 93714 5551 -
2019 (నేటికి) 1,14,315 5650 5311