Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
- అమిత్షా ప్రకటనపై తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటన ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదకరమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. 1947 స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా భారత దేశాన్ని ''భారత యూనియన్''గా ప్రకటించుకున్నామని పేర్కొంది. అనేక మతాలు కలిగిన దేశంలో లౌకికవాదాన్ని అమలు చేయాలని రాజ్యాంగంలో పొందుపర్చబడిందని తెలిపింది. అలాంటి రాజ్యాంగంలోని ఆదేశాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. మొత్తం రాజ్యాంగాన్ని మార్చే దురుద్దేశంతో బీజేపీ అడుగులు వేస్తున్నదని విమర్శించారు. ఆర్టికల్ 370 సవరణ కూడా అందులో భాగమేనని గుర్తు చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ప్రస్తుతం భాషపై దాడి ప్రారంభించిందని తెలిపారు. రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 22 భాషలున్నాయని పేర్కొన్నారు. మరో 44 భాషలను గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. రాజ్యాంగానికి 21వ సవరణ 1967 ద్వారా దేశంలో ఒకే భాష కాకుండా హిందీ వున్నప్పటికీ ఇంగ్లీష్ను అనుసంధాన భాషగా పెట్టాలని, రాష్ట్రాల భాషలను అధికార భాషగా పెట్టుకోవచ్చునని ఆమోదించారని తెలిపారు. అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రభాషను అధికార భాషగా కొనసాగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. హిందీ మాట్లాడేవారి సంఖ్య 45 శాతం మాత్రమేనని తెలిపారు. ఆ భాషను మొత్తం భారత ప్రజలపై రుద్దడం నియంతృత్వమే అవుతుందని పేర్కొన్నారు. అనేక జాతులు, మతాలు విభిన్నతత్వం కల్గిన భారత దేశంలో ఒకే భాష, ఒకే మతం అని ప్రకటించడం అంటే మైనార్టీ మతాలపై దాడిచేయడమేనని విమర్శించారు. రాష్ట్రాల భాషలకు చెల్లుచీటీ ఇవ్వడమే అవుతుందని తెలిపారు. అధికారంలో వున్న పార్టీ రాజ్యాంగ విరుద్ధ ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశ చరిత్రను వక్రీకరించడం, మైనార్టీ మతాలపై దాడులు చేయడం, చివరికి మైనార్టీ భాషలపై ఆధిపత్యం చేసేలా విధానాలు కొనసాగించడం మూలంగా దేశ సమైక్యతకు హాని కలుగుతుందని తెలిపారు. తక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్షా తన ప్రకటనను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.