Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం లేఖకు గుడ్డిగా రాష్ట్ర సర్కారు ఓకే
- నామమాత్రపు షరతులతో అనుమతులు
- సేవ్ నల్లమల, ప్రజా ఉద్యమంతో సర్కారులో కదలిక
- యురేనియం తవ్వకాలకు వ్యతిరేకమంటూ సీఎం ప్రకటన
- నల్లమల సరే... లంబాపూర్-పెద్దగట్టు మాటేంటి?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'యురేనియం తవ్వకాల్లో తమ పాత్ర ఏమీ లేదూ, యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తాం' అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు నెలలుగా తమకేమీ పట్టనట్టుగా ఉన్న రాష్ట్ర సర్కారు ప్రజా ఉద్యమం తీవ్రమయ్యేకొద్దీ వెనక్కి తగ్గింది. యురేని యం తవ్వకాల సర్వే విషయం లో కేంద్రం నిర్ణ యాన్ని వ్యతిరేకించ లేదు. అను మతుల కోసం కేంద్రం రాసిన లేఖనూ తిర స్కరించ లేదు. గుడ్డిగా తలఊపుతూ అనుమతులు ఇవ్వడంతోనే సమస్య మొదలైంది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్లమల ప్రజలు చేపడుతున్న బలమైన ఉద్యమం, మరోవైపు సోషల్ మీడియా వేదికగా డీవైఎఫ్ఐ చేపట్టిన 'సేవ్నల్లమల' ఉద్యమానికి మద్దతు పెరగటం, మేధావులు, సామాజిక వేత్తలు చైతన్య కార్యక్రమాలు, నిరసనలు చేపడుతుండటంతో యురేని యం తవ్వకాలకు వ్యతిరేకమంటూ రాష్ట్ర సర్కారు ప్రకటన చేసింది. వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామంటూ సీఎం కేసీఆర్ కూడా సభలో ప్రకటించారు.
'అటామిక్ మినరల్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (ఎంఎడీ), నల్లగొండ జిల్లా లంబాపూర్, పెద్దగట్టు, చింత్రియాల్లో 1992-2012 మధ్య కాలంలో 18,550 టన్నుల యురేనియం నిక్షే పాలు ఉన్నాయని నిర్ధారించబడిందని, నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లా ల్లో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఎఎండీ ఎటువంటి అన్వేషణను చేపట్టలేదు' అని శాసనమండలిలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పారు. కానీ, పెద్దగట్టు-లంబాపూర్-చింత్రియాల్లో యురేనియం తవ్వకాలకు సంబంధించిన సర్వే గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూనే ఉన్నది. యూసీఐఎల్కు లంబాపూర్-పెద్దగట్టు ప్రాంతంలో 2012 వరకు మాత్రమే యురేనియం తవ్వకాలు చేపట్టాలి. యూసీఐఎల్ ఎవ్వ రికీ చెప్పకుండానే 2012లో తవ్వకాల అనుమతిని పొడిగించుకున్నది. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాక కూడా యురేనియం అన్వేషణ కొనసాగుతూనే ఉన్నది. 2017-18లో చెట్లకు నెంబర్లను వేస్తున్న ఫారె స్టు అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. గట్టిగా నిలదీస్తే యురేని యం తవ్వకాల వల్ల ఎన్నిచెట్లు నష్టపోతాయే చెబితే నష్టపరిహారం చెల్లిస్తామని ఎఎమ్డీ, యూసీఐల్ అధికారులు ఆదేశించడంతో చేస్తున్నామని ఫారెస్టు అధికారులు చెప్పడంతో పనులను అడ్డుకున్నారు. నల్లమలలో జంగంరెడ్డిపల్లి, బీకే తిరుమలాపూర్, ఉడిమిళ్ల, వటవర్లపల్లి, పదర ప్రాంతాల్లోనూ, బొమ్మన్పల్లి, ఐనోలు ప్రాంతాల్లోనూ చెట్లకు మార్కింగ్ చేశారు. 2017 ఏప్రిల్లో కేంద ప్రభుత్వ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ సర్వే కోసం బోర్లు వేయడానికి అనుమతి కోరుతూ రాష్ట్ర అటవీ శాఖకు లేఖ రాసింది. అటవీ శాఖ అనుమతిచ్చే సింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెల్వకుండా ఇసుమెత్తయినా జరుగదు. వన్యప్రాణి సంరక్షణ బోర్డు మెంబర్గా ఉన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా దానిపై సంతకం పెట్టారు. 2016లో కొంత మంది శాస్త్రవేత్తలు స్థానిక ఫారెస్టు అధికారులు, పోలీసుల సహకారంతో యురేనియం సర్వేల నిమిత్తం రాగా స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించేశారు. అయితే, ఆ తర్వాత కాలంలో అమ్రాబాద్, పరద మండలాల్లోని సబ్స్టేషన్లలో బోర్లు వేశారు. ఒక్కో బోరు రెండు,మూడు రోజులు వేశారని, ఒకవేళ, అధికారులు చెబుతున్నట్టుగా భూగర్భ జలాల మట్టాల సేకరణకే అయితే వెయ్యి నుంచి 1500 ఫీట్లు బోర్లు ఎందుకు వేయాల్సి వచ్చిందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. 'రెవెన్యూ భూములలో కేంద్రం, రాష్ట్రానికి సంబంధించిన ఎవరేని అధికారి నుంచి ఎటువంటి అనుమతి అవసరం లేదు. అయితే, అటవీ ప్రాంతానికి సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంఓఇఎఫ్) నియమాల ప్రకారం అటవీ శాఖ అనుమతి అవసరం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అన్వేషణ నిర్వహించలేదు. పర్యావరణ హిత విధానంలో సాధారణంగా అన్వేషణ కొనసాగుతున్నది. దీని వల్ల ఆ ప్రాంత జీవ వైవిధ్యానికి ఏ విధంగా ప్రభావితం కాదు... ఇదివరకు ఉన్న అటవీ ట్రాకులనే వినియోగిస్తారు. మనుషులు, యంత్రాల కదలికల కోసం ఎటువంటి నూతన రోడ్లను వేయడం లేదు. రాత్రి సమయాల్లో ఎటువంటి కార్యకలాపాలు జరుగవు. ఉదయం సమయంలోనే అన్వేషణ కొనసాగుతుంది. చెట్లను నరకడం, కూల్చడం జరుగదు. డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత భూ ఉపరితలాన్ని యథాతధా స్థితి తీసుకురావడం జరుగుతుంది. అన్నీ అటవీ శాఖ నిర్ధిష్టపరిచిన షరతుల మేరకు జరుగుతాయి' అని మంత్రి చెప్పారు. అనుమతులు ఇవ్వలేదంటూనే... తవ్వకాల అనుమతులకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బోర్లు వేసుకోవచ్చు గానీ, తవ్వకాలు జరిపే సమయంలో పెద్దపెద్ద వాహనాలు తీసుకెళ్లవద్దని అనుమతులు ఇచ్చింది. యూసీఐఎల్ పొందుపర్చిన దాంట్లో 40 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాదని పేర్కొంది. అంటే ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లు చేసే స్థాయి శబ్ధంతో బోర్లు వేయడం ఎలా సాధ్యమో? పెద్ద పెద్ద వాహనాలను అడవుల్లోకి పంపించకుండా వందల ఫీట్ల బోర్లను ఎలా వేస్తారో? చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏజెన్సీ పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభ పెట్టకుండా చిన్న పని కూడా చేయకూడదని నిబంధన ఉంది. దీనికీ పాలకులు తిలోదకాలు ఇచ్చారు. పెసాచట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం-1992, సహజవనరుల సంరక్షణ చట్టం-1972, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి-1974, అడవుల సంరక్షణ చట్టం-1980, అటవీ పర్యావరణ శాఖ-1985, పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం-1995, జీవవైవిధ్య చట్టం-2002, అటవీహక్కుల చట్టం-2006లన్నింటినీ పాలకులు బుట్టదాఖలు చేశారు. సర్వే నిమిత్తం బీకేతిరుమలాపూర్లో బోర్లు వేశారు. ఇది చట్ట ఉల్లంఘన కిందకు వస్తుంది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమలలో ఉద్యమం తీవ్ర అవుతుండటంతో సర్కారు వెనక్కి తగ్గింది.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల్లేనిదే పనులు అస్సలు జరుగవు : సజయ, సామాజిక ఉద్యమకారులు
రాష్ట్ర ప్రభుత్వం అనుమతులకు సంతకం పెట్టనిది పనులు అస్సలు జరుగవు. సర్వేకు అనుమతి ఇచ్చేశారు. 2017లో కొంత ఇచ్చేశారు. లేకపోతే ఎంఓఈఎఫ్ వాళ్లు మైనింగ్ చేస్తామని ఎలా వస్తారు? మాకు ఏం తెల్వదు? మేం ఇవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వాస్తవం కాదు. లంబాపూర్-పెద్దగట్టు-చిత్రియాల్ గురించి మాట్లాడటం లేదు. పెద్దగట్టు ప్రాంతంలో తవ్వకాలు జరిగినా రాష్ట్రానికి పెద్దఎత్తున నష్టమే. కృష్ణానది కాలుష్యమవుతున్నది. రాజకీయ లబ్ధి కోసం సీఎం వ్యతిరేకించగానే సరిపోదు. వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానాన్ని పంపుతామన్న మాటను సీఎం నిలబెట్టుకోవాలి.