Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24న కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బొగ్గు పరిశ్రమలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వందశాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించొద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వరంగ బొగ్గు పరిశ్రమను ధ్వంసం చేసేందుకు, విదేశీ కార్పొరేట్లకు దేశంలోని సహజ వనరులను కట్టబెడుతున్నదని విమర్శించారు. ఈ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 24న కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. బొగ్గు పరిశ్రమలో విదేశీ పెట్టుబడులకు మోడీ ప్రభుత్వం అనుమతులిచ్చి కోల్రంగానికి తీవ్రమైన హాని తలపెడుతున్నదని పేర్కొన్నారు. దీనివల్ల దేశ అవసరాలను దృష్టిలో వుంచుకోకుండా బొగ్గును ఎగుమతి చేసుకునే వీలు కలుగుతుందని తెలిపారు. దేశంలోని థర్మల్ పవర్ స్టేషన్లు, ఎరువు కర్మాగారాలు, స్టీలు, సిమెంటు వంటి బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
విదేశీ కంపెనీలు యాంత్రీకరణ, కాంట్రాక్టు పద్ధతి, లాభాపేక్ష దృష్టితో వ్యవహరించడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని తెలిపారు. సింగరేణి వంటి సంస్థలు నిర్వీర్యం అవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అందువల్ల దేశ ప్రయోజనాలను విదేశీయులకు కట్టబెట్టే ప్రజావ్యతిరేక చర్యలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు ఐక్యంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.