Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్షేమ పథకాల పేరుతో స్కాములు చేసి సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారనీ, రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి కూరుకుపోయేలా చేశారని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే మూడు లక్షల కోట్ల భారాన్ని మోయలేక తెలంగాణ ఆర్థిక శాఖ సతమతమవుతుంటే...కాంగ్రెస్తో పాటు బీజేపీని గల్లంతు చేసేందుకు మరో మూడు స్కీములు తన అమ్ముల పొదిలో ఉన్నాయని కేసీఆర్ ప్రకటన చూసి నవ్వాలో? ఏడవాలో? తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి పేర్లతో గనక మళ్లీ అప్పులు చేయడం మొదలుపెడితే కాంగ్రెస్, బీజేపీ మాట ఏమో కానీ అప్పుల బాధ తట్టుకోలేక ఈసారి తెలంగాణ ప్రజలు గల్లంతై పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులను తీర్చేందుకు..చివరకు మోడీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకోవాలేమో? అని ఎద్దేవా చేశారు.