Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్వో, వీఆర్ఏ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ ఉద్యోగులపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వీఆర్వో, వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్రకుటుంబ సర్వేలో, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో కీలక పాత్ర వహించిన వీఆర్వో, వీఆర్ఏలపై సీఎం అనుచితం మాట్లాడటం సరిగాదన్నారు. రెవెన్యూ శాఖ మెరుగు కోసం చట్టాన్ని పటిష్టం చేస్తే స్వాగతిస్తాంగానీ, ఉన్న ఉద్యోగులను పీకేస్తామంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను సీఎం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు.
ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే ఇదేనా?
ఉద్యోగులను బెదిరించడం సరిగాదు : టీఎస్యూటీఎప్
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళనలు చేస్తుంటే, సమస్యలు పరిష్కరించకపోగా....కుక్క... తోక...అంటూ అగౌరపరిచేలా మాట్లాడటం, ఉద్యోగులను తొలగిస్తానంటూ బెదిరించటం సమంజసం కాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాములు, సీహెచ్ రవి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంప్లాయి ఫ్రెండ్లీ అని చెప్పుకునే సీఎంకి ఇది ఎంత మాత్రం తగదని తెలిపారు. 2018 మే 16న సీఎం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో నాలుగున్నర గంటల పాటు భేటీ అయ్యి 18 సమస్యలపై చర్చలు జరిపితే 13 సమస్యలు పరిష్కరిస్తున్నామని అంగీకరించారని, ఏడాదిన్నర గడిచినా ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల శత్రుపూరిత వైఖరి సరిగాదన్నారు. ఐఆర్, పీఆర్సీ, కాంట్రాక్టు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సమాన వేతనాల చెల్లింపు, సీపీఎస్ రద్దు, ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
బెదిరిస్తే ఎవరు భయపడరు : టీఎస్పీటీఏ,
బెదిరిస్తే ఇక్కడ భయపడటానికి ఏ ఒక్క ఉద్యోగి కూడా సిద్ధంగా లేరని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి నాగనమోని చెన్నరాములు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం ఆందోళన చేయడం ప్రజాస్వామిక హక్కు అనీ, దానిని కాదనే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. బెదిరింపుల ద్వారా ఉద్యమాలు లేకుండా చేయాలని చూస్తే, వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగులతో పెట్టుకున్న వాళ్ళ, చరిత్రలో సున్నాగా మిగిలిపోయారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించాలని హితవు పలికారు. ఉద్యోగ వర్గాలను కించపరిచేలా మాట్లాడటం, ఉద్యోగులను పీకేస్తానంటూ మాట్లాడటం అవివేకం అని పేర్కొన్నారు.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : ఎస్జీటీయూ
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.మధుసూదన్రావు, కె.మహిపాల్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సకల జనుల సమ్మె అప్పుడు అవసరమొచ్చిన ఉద్యోగులు... అధికారంలోకి రాగానే కానరాకుండా పోయారా? అని ప్రశ్నించారు.